టీడీపీపై కుట్ర, తప్పుడు సర్వేలు, బాబుకు వారెంట్లా?: కేంద్రంపై యనమల, నక్కా నిప్పులు
అమరావతి/గుంటూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బాబ్లీ కేసులో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కేంద్రం, బీజేపీ విమర్శలు దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు బీజేపీపై ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్లు కాక ఇంకేమొస్తాయ్!, 25సార్లు సమన్లు..: బాబ్లీ కేసుపై అమిత్ షా
తప్పుడు సర్వేలెందుకు?
అవినీతిపరులతో అంటకాగుతూ దొంగలు అందరినీ దేశం దాటిస్తున్నారని బీజేపీపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్, తప్పుడు సర్వేలను చేయించడంపైనా అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లకు వారెంట్లు ఇచ్చారని.. ప్రజాదరణ ఉన్నవారిని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.
టీడీపీనీ దెబ్బతీసేందుకే మోడీ వ్యూహం
బీజేపీ పెడధోరణులు దేశానికే తీవ్ర ముప్పుగా పరిణమించాయని యనమల అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వ్యూహాలు వికటిస్తున్నాయన్నారు.
8ఏళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడితే ఇప్పుడు వారెంట్లు రావడం ఏమిటని యనమల ప్రశ్నించారు. బాబ్లీ మీద పోరాటం ఎవరి కోసం.. 74మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు లాఠీదెబ్బలు తిన్నదెవరి కోసం.. తెలుగువాళ్లు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలన్నదే టీడీపీ ధ్యేయమని మంత్రి వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీనీ దెబ్బతీయాలన్నదే నరేంద్ర మోడీ వ్యూహమని ఆరోపించారు.
అందుకే బాబుపై కుట్రలు
టీడీపీ ఆధ్వర్యంలో మోడీ వ్యతిరేక శక్తులు బలోపేతం కావడంపై బీజేపీలో అక్కసు నెలకొందని, బీజేపీ వ్యతిరేక కూటమిని బలహీన పరిచేందుకే మోడీ మహా కుట్రలు పన్నుతున్నారని యనమల ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు రావడం కూడా ఇందులో భాగమేమనని ఆయన దుయ్యబట్టారు. తమ చెప్పుచేతల్లో మీడియా సంస్థల ద్వారా బోగస్ సర్వేలు చేయించారని ఆరోపించారు. 2014లో ఇవే సంస్థలు చేసిన సర్వేలు అవాస్తవమని ప్రజాతీర్పు రుజువు చేసిందన్నారు. సర్వేల ముసుగులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం అసాధ్యమని, వేధింపు చర్యలకు ప్రజలే బీజేపీకి గుణపాఠం చెబుతారని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో నుంచి టీడీపీని దూరం చేయడం ఎవరి తరం కాదని మంత్రి యనమల అన్నారు.
పవన్, జగన్ స్పందించాలి
మరో మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయని అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత బాబ్లీ కేసు తెరపైకి రావడం కుట్రపూరితమేనని గుంటూరులో ఆరోపించారు. ఆ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందన్న కారణంతో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న తమ పార్టీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారని.. ఐదు రోజుల పాటు మహారాష్ట్ర పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని తెలిపారు. చంద్రబాబు మినహా అందరిపైనా భౌతిక దాడులు చేశారన్నారు. చంద్రబాబుకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ కావడంపై జగన్, పవన్ కళ్యాణ్ స్పందించాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.