మార్గదర్శి మాటేంటి, జగన్ని చూస్తే భయం: యనమల, అసెంబ్లీ ముందు ధర్నా: టిడిపికి బిజెపి షాక్
హైదరాబాద్: ఏపీ శాసన సభలో అగ్రిగోల్డ్ అంశంపై సోమవారం నాడు రభస జరిగింది. ఈ అంశంపై శాసన సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం సాయంత్రం చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసిపి అధినేత జగన్, మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావుల మధ్య వాగ్వాదం జరిగింది.
జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... అగ్రిగోల్డు గ్రూపులో 155 కంపెనీలు ఉన్నాయని, మిగతా కంపెనీల పైన కూడా ఆరా తీయాలన్నారు. అగ్రిగోల్డ్ కేసును సిబిఐకి అప్పగించాలన్నారు. దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. జగన్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ కేసును సిబిఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, సిబిఐకి అప్పగిస్తే లబ్ధిదారులకు న్యాయం ఆలస్యం అవుతుందని, ఏం జరిగినా జగన్ బాధ్యత తీసుకుంటానంటే మేం అర నిమిషంలో సిబిఐకి ఇచ్చామని చెప్పారు.
ఓ సందర్భంలో పత్తిపాటి మాట్లాడుతూ... దొంగలకు మాత్రమే దొంగ లెక్కలు తెలుస్తాయన్నారు. అగ్రిగోల్డుకు సంబంధించి ఏ ఆధారాలు ఉన్నా జగన్ తమకు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్కు అసలు సిబిఐ గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
మార్గదర్శి మాటేమిటి
అగ్రిగోల్డ్ ఎదిగింది కాంగ్రెస్ హయాంలోనే అని పత్తిపాటి పుల్లా రావు అన్నారు. అగ్రిగోల్డు పైన వైయస్ రాజశేఖర రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కానీ నిజాయితీగా, న్యాయబద్దంగా పని చేసే మార్గదర్శి పైన కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డారన్నారు. కానీ అగ్రిగోల్డు పైన వైయస్ చర్యలు తీసుకోలేదన్నారు. సిబిఐ పేరుతో బాధితులకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారన్నారు.
జగన్ మాట్లాడుతూ... ఎంత చెప్పినా వీరికి అర్థం కావడం లేదని, అందుకే తాను మరోసారి చెబుతున్నానని అన్నారు. 1998లోనే అగ్రిగోల్డును సెబి బ్యాన్ చేసిందని, మరి అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
మంత్రి యనమల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. జగన్ మొహం చూస్తుంటే భయమేస్తోందని ఎద్దేవా చేశారు.
జగన్ మాట్లాడుతూ.. అగ్రిగోల్డు యాజమాన్యాన్ని తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారు సోనియా వద్దకు తీసుకెళ్లారని మంత్రి పత్తిపాటి చెప్పడం విడ్డూరమని, ఇంకా నయం బరాక్ ఒబామా వద్దకు తీసుకెళ్లినట్లుగా చెప్పలేదని ఎద్దేవా చేశారు.
2001లో అగ్రిగోల్డు చైర్మన్ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోటోలు దిగారని చెప్పారు. ఈ ఫోటో చాలా చక్కగా ఉందని, చంద్రబాబు అందులో బాగా నవ్వుతున్నారని చెప్పారు.
బొండ ఉమ మాట్లాడుతూ... జగన్ మాట్లాడిన దాంట్లో ఒక పర్సెంట్ నిజం ఉంటే, 99 శాతం అబద్దాలు ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం సీబీఐ విచారణకే కాదు, ఏ విచారణకైనా సిద్ధమని చెప్పారు.
టిడిపికి బిజెపి హెచ్చరిక
సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, తమది జాతీయ పార్టీ అని గుర్తించాలని బిజెపిఎల్పీ విష్ణుకుమార్ రాజు టిడిపి నేతలు, మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీంతో, మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని మంత్రులు చెప్పారు.