అవిశ్వాసంపై యనమల ట్విస్ట్! 'పవన్ అవసరం లేదు, అడిగితే నీళ్లు నములుతున్నాడు'
అమరావతి: సభలో అవిశ్వాసం నోటీసు ఇస్తే తిరస్కరించే అధికారం స్పీకర్కు లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం చెప్పారు. సభ సజావుగా లేదని తిరస్కరించడం సభాపతికి తగదని చెప్పారు.
సభ సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. వెల్లో ఆందోళన చేసే అన్నాడీఎంకే బీజేపీకి మిత్రపక్షమే అని వ్యాఖ్యానించారు. అవిశ్వాసం నుంచి తప్పించుకునేందుకు బీజేపీ మిత్రపక్షాలతో ఆందోళన చేయిస్తోందన్నారు.
అవిశ్వాసం నుంచి తప్పించుకోవడం సరికాదు
అవిశ్వాసం నుంచి తప్పించుకోవటం అంటే రాజకీయ ఆత్మహత్య వంటిది అని యనమల రామకృష్ణుడు అన్నారు. అవిశ్వాసం విషయంలో కేంద్రం ఎందుకు పారిపోతోందని ప్రశ్నించారు. అవిశ్వాసం ఎదుర్కోవాలన్నారు.
బాబుకు మార్కులు వేసే అనుభవం ఉందా
జనసేనపై టీడీపీ ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు మండిపడ్డారు. సరైన విధానాలు లేని పార్టీ జనసేన అన్నారు. చంద్రబాబుకు మార్కులు వేసేంత అనుభవం పవన్కు ఎక్కడ ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ నీళ్లు నమిలే పరిస్థితి
గుంటూరు సభలో టీడీపీపై, లోకేష్ పైన తాను చేసిన ఆరోపణలకు పవన్ కళ్యాణ్ నీళ్లు నమిలే పరిస్థితి అని కళా వెంకట్రావు అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేస్తే ఓ పని అయిపోతుందన్నట్లుగా పవన్ తీరు ఉందన్నారు. రాజకీయ పరివర్తన లేని పవన్ వ్యాఖ్యల్లో విశ్వసనీయత లేదన్నారు.
పవన్ మార్కులు అవసరం లేదు
చంద్రబాబుకు, టీడీపీకి పవన్ కళ్యాణ్ మార్కులు అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. పవన్ ఎవరి డైరెక్షన్లో మాట్లాడుతున్నారో గానీ రోజుకు ఓ మాట మాట్లాడుతున్నారన్నారు. తమకు 70 శాతం మంది ప్రజలు ఓట్లు వేశారని, అలాంటప్పుడు పవన్ అవసరం లేదన్నారు.