జగన్ పార్టీ నుండి 30 మంది: టిడిపి, కాదన్న భూమా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి తమ పార్టీలో చేరేందుకు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆదివారం చెప్పారు. కొత్త పార్టీలు అధికారంలోకి రాకుంటే ఆ పార్టీల మనుగడ చాలా కష్టమని చెప్పారు. టిడిపిలో చేరినప్పటికీ ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలకు నిబంధనలు వర్తించవని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేవలం రిజిస్టర్డ్ పార్టీయేనని, రికగ్నైజ్డ్ పార్టీ కాదని చెప్పారు.
30 మంది ఎమ్మెల్యేలు: మాగంటి బాబు
టిడిపిలో చేరడానికి 30 మంది జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత మాగంటి బాబు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, సీమాంధ్ర అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మి వీరంతా టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. జగన్ తన దుకాణాన్ని బంద్ చేసుకోవాల్సిందే అన్నారు.
శుభసూచకం: సిఎం రమేష్
జగన్ పార్టీ ఎంపీ ఎస్పీవై రెడ్డి తమ పార్టీలో చేరడం శుభసూచకమని టిడిపి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. సీమాంధ్రలో అభివృద్ధి టిడిపి, ఎన్డీయే ప్రభుత్వాలతోనే సాధ్యమని నమ్మి ఎస్పీవై రెడ్డి తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసి పార్టీలో చేరారన్నారు. జగన్ పార్టీ నుంచి చాలా మంది తమ పార్టీలోకి వస్తారన్నారు. అందరినీ కాకుండా, రాష్ట్రాభివృద్ధి కోసం, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతారని అనుకున్న వారినే తీసుకుంటామన్నారు. అలాంటి వారి విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు.
భూమా నాగిరెడ్డి వివరణ
తాను టిడిపిలో చేరుతానని ప్రచారం జరుగుతోందని అందులో ఎలాంటి వాస్తవం లేదని భూమా నాగిరెడ్డి వివరణ ఇచ్చారు. తన రాజకీయ జీవితమంతా వైయస్ జగన్తోనే ఉంటుందని చెప్పారు. తాను టిడిపిలో చేరనన్నారు. తన నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తానన్నారు. తమ పార్టీ ఎంపీలు టిడిపిలో చేరడం బాధాకరమని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.