పనామా పేపర్స్: బ్యాంకు తాకట్టు సొమ్మే.. జగన్పై యనమల బాంబు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం నాడు విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి పనామా పేపర్లలో వచ్చిన నేపథ్యంలో సీబీఐ, ఈడీ దీనిని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
జగన్ అవినీతి పైన సీబీఐ, ఈడీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ బినామీ రామ్ ప్రసాద్ గురించి పనామా పత్రాలు గుట్టురట్టు చేశాయన్నారు. కాబట్టి జగన్ అవినీతి పైన సీబీఐ, ఈడీ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
పనామా పత్రాలు వెల్లడించిన వివరాలు పరిగణలోకి తీసుకొని జగన్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందూ ప్రాజెక్టు, ఇందూ టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూములిచ్చి జగన్ డబ్బు కూడబెట్టాడని ఆరోపించారు. బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్లో జగన్కు పెట్టుబడులు ఉన్నాయని, అవి ప్రభుత్వం కేటాయించిన భూములను జగన్ బ్యాంకుల్లో తాకట్టుపెట్టగా వచ్చిన సొమ్మేనని బాంబు పేల్చారు.
జగన్ మొసలి కన్నీరు: దూళిపాళ్ల
ఏపీ రైతుల పైన జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష హోదాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాకట్టు పెట్టారన్నారు.
ప్రాజెక్టులపైన ఏపీలో దీక్ష చేసే జగన్.. తెలంగాణలో వైసిపి నేతలకు ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై దీక్ష చేసే నైతిక హక్కు లేదన్నారు. రెండు నాల్కల ధోరణితో జగన్ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారన్నారు.