ఆ ఓట్లు చీల్చి అస్థిరత పరిచే కుట్ర, పవన్ కీలుబొమ్మ: మోడీ-షాలపై యనమల తీవ్రవ్యాఖ్యలు
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు ఇద్దరు నియంతలు అని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం మండిపడ్డారు. మహానాడులో రాజకీయ తీర్మానం సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. న్యాయవ్యవస్థలో కూడా మోడీ ప్రభుత్వం వేలు పెడుతున్నారన్నారు.
ముద్దుల పోటీనా, చాక్లెట్ ఇవ్వని డాడి.. మోడీ నుంచి జగన్ దాకా: మహానాడులో పడిపడి నవ్విన చంద్రబాబు
కూలీలకు కూడా డబ్బులివ్వని ప్రభుత్వంబీజేపీ ప్రభుత్వం అన్నారు. బీజేపీ చేతిలో వైసీపీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కీలుబొమ్మలు అని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ కుట్ర జరుగుతోందని దానిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక బీజేపీకి ఎదురుగాలి ప్రారంభమైందన్నారు.
టీడీపీ బయటకు వచ్చాక బీజేపీ గెలవలేదు
ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేకపోయిందని యనమల చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో మైనింగ్ మాఫియా నేతలను నిలబెట్టి బీజేపీ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. యడ్యూరప్పకు కూడా టిక్కెట్ ఇచ్చారన్నారు. మోడీ, అమిత్ షాలు బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ఆ ఇద్దరు నేతల్లో ఒకరు ముసోలిని, మరొకరు హిట్లర్ అన్నారు.
మోడీ, అమిత్ షాలది నిరంకుశ పాలన
మోడీ, అమిత్ షా నిరంకుశ పాలనతో దేశం విసిగిపోయిందన్నారు. 2019లో ప్రాంతీయ పార్టీలు కలిసి కేంద్రంలో అధికారంలోకి వస్తాయని యనమల చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పుతుందని జోస్యం చెప్పారు. రానున్న కాలం ప్రాంతీయ పార్టీలదేనని అభిప్రాయపడ్డారు. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయమే ఇందుకు నిదర్శనం అన్నారు.
చంద్రబాబు పిలుపుతో కర్ణాటకలో ఓడిన బీజేపీ
చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం వల్లే కర్ణాటకలో బీజేపీ ఓటమి చవి చూసిందని యనమల చెప్పారు. కర్ణాటక ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు నాంది పలికాయన్నారు. కుమారస్వామి సీఎం ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడం దేశంలో రాజకీయ పునరేకీకరణకు తార్కాణం అన్నారు.
బీజేపీపై కుట్ర
బీజేపీపై ఏపీ, తెలంగాణలలో వ్యతిరేకత ఉందని యనమల చెప్పారు. ఏపీలో టీడీపీ అనుకూల ఓటు చీల్చి అస్థిరత నెలకొల్పేందుకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బలమైన పార్టీలకు ఉనికి లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాజకీయాలే ఇందుకు నిదర్శనం అన్నారు. బీజేపీపై ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉందన్నారు.
మోడీ సీఎంగా ఉన్నప్పుడు వీసా రద్దు చేశారని గుర్తుంచుకోవాలి
చంద్రబాబుపై కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు. జగన్ ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా వీసా రద్దు చేసిందని విషయం గుర్తుంచుకోవాలన్నారు. జగన్కు షేక్ హ్యాండ్ ఇస్తే జైలుకు వెళ్తారని భయపడుతున్నారన్నారు.