టీడీపీ పాలనపై విచారణ వెనుక .. వైఎస్ జగన్ కు సీబీఐ కేసుల భయం ఉందన్న యనమల
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు . సుప్రీంకోర్టు ఆదేశాలతో వైయస్ జగన్ కు కేసుల భయం పట్టుకుందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీల మీద అవినీతి విచారణల పేరుతో దృష్టి మళ్ళిస్తున్నారని ఆరోపించారు . అవినీతి, ఆర్థిక నేరాల కేసులు ఆలస్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చిందని, దీంతో జగన్ కు భయం పట్టుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దుర్మార్గుల పాలనలో మంచివాళ్ళకు కష్టాలు .. ఏపీనే ఉదాహరణ : అమరావతి భూములపై చంద్రబాబు
అవినీతి, ఆర్ధిక నేరాల కేసులను త్వరితగతిన తేల్చాలన్న సుప్రీం ఆదేశాలు
సుప్రీంకోర్టు తాజాగా అవినీతి, ఆర్థిక నేరాల కేసులను సత్వర విచారణ చేయాలని ఆదేశించడంతో పాటుగా దేశంలోని హైకోర్టు నుంచి ఈ తరహా కేసుల కార్యాచరణను కూడా సుప్రీంకోర్టు సిద్ధం చేయమని చెప్పిందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు నాలుగు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని, అందులో రెండు వేల ఐదు వందల కేసులు రాజకీయ నేతలపై ఉన్నాయని ఆయన తెలిపారు. అవినీతి, ఆర్థిక నేరాల కేసులలో ఇప్పటి వరకు 12 చార్జిషీట్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సిబిఐ కోర్టులో దాఖలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
జగన్ భయంతో ప్రజల దృష్టి మళ్ళించే యత్నాలు .. అందుకే గత ప్రభుత్వ పాలనపై విచారణ
సీబీఐ కేసుల విచారణకు భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్ళించడం కోసం ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేస్తున్నారని, అందులో భాగంగానే మంత్రివర్గ ఉప సంఘాలను , ఏసీబీ విచారణను తెరపైకి తీసుకు వస్తున్నారని టిడిపి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఏం చేయాలో అర్థం కాక, చిత్ర విచిత్ర మైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనపై విచారణ చేయిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
Recommended Video
ప్రభుత్వ చట్ట వ్యతిరేక నిర్ణయాలపై హైకోర్టు స్టే ఇచ్చిందన్న యనమల
గతంలో ఏ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడలేదు అని యనమల గట్టిగా విమర్శించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకమైన నిర్ణయం కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చిందని ఆయన తెలిపారు. అంతేకాదు హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు యనమల రామకృష్ణుడు. పత్రికా హక్కుల గురించి మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆలోచించి మాట్లాడాలి అన్నారు. సొంత మీడియా ద్వారా నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని యనమల రామకృష్ణుడు హితవు పలికారు.