బ్రేక్ ఫెయిల్: 2బస్సులను ఢీకొన్న మరో స్కూల్ బస్, 40మంది విద్యార్థులకు గాయాలు
విశాఖపట్నం: యారాడ కొండపై ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. కొండపై నుంచి కిందికి వస్తుండగా ఓ బస్సు బ్రేకులు ఫెయిలై మరో రెండు బస్సులను ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల్లోని 40మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి ఉడ్పేటకు చెందిన సిటీ పబ్లిక్ స్కూల్ యజమాన్యం నాలుగు బస్సుల్లో 200 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందిని శనివారం ఉదయం యారాడ విహారయాత్రకు తీసుకెళ్లింది.
మధ్యాహ్నం లైట్ హౌస్ వద్ద భోజనాలు చేసి విద్యార్థులంతా యారాడ తీరానికి బస్సుల్లో బయలుదేరారు. నాలుగు బస్సులు వరుసగా ఘాట్ రోడ్లో కిందకు దిగుతున్న సమయంలో మూడో బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
దాన్ని నిలువరించేందుకు ముందు వెళ్తున్న బస్సులను డ్రైవర్లు ఆపారు. దీంతో ఆ బస్సు ముందున్న రెండు బస్సులను బలంగా ఢీకొట్టి నిలిచిపోయింది. కాగా, ఆ సమయంలో బస్సు డ్రైవర్ల అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
అయితే, ఆ 3బస్సుల్లోని సుమారు 120మందిలోని 40మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను గాజువాక, విశాఖ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై హుటాహుటిన ఆస్పత్రులకు చేరుకున్నారు. గాయపడిన తమ పిల్లలను చూసి కన్నీటిపర్యాంతమయ్యారు.