అమరావతి శిలాఫలకం తెలుగులో లేకపోవడం బాధకారం: యార్లగడ్డ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి వేసిన శిలాఫలకం తెలుగు భాషలో లేకపోవడం బాధాకరమని మాజీ పార్లమెంటు సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు భాషపై తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమిళ భాషపై అలాగే వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం మాదిరిగానే ఎపిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తెలుగు విశ్వవిద్యాలయం విషయంలో కొంత మంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగువారి పట్ల, తెలుగు భాష పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్న తమిళనాడు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇటీవల అన్న విషయం తెలిసిందే. చెన్నై నగరానికి తెలుగు గంగ ద్వారా సరఫరా అవుతున్న మంచినీటిని ఆపేయాలని, తెలుగు భాష కోసం కఠినం కోసం వ్యవహరించాలని ఆయన ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రులను కోరారు.
తమిళేతర భాషలకు సంబంధించినవారు సైతం తమిళంలోనే పరీక్షలు రాయాలనే జయలలిల ప్రభుత్వ ఆదేశాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జయలలిత నిర్ణయం వల్ల తమిళనాడులోని 900 పాఠశాలల్లోని 92 వేల మంది తమిళేతర విద్యార్థుల భవిష్యత్తు అంధాకరంలో పడిందని ఆయన చెప్పారు.
తెలుగు భాషకు ప్రాచీన హోదా రాకుండా గతంలో మారన్ అడ్డుకున్నారని, తమిళ భాషకు ప్రాచీన హోదా రాగానే అర్హతను రెండు వేల ఏళ్లకు పెంచారని ఆయన అన్నారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకి మంచినీరు ఇస్తుంటే తమిళనాడులోకి ఆ కాలువ ప్రవేశించగానే కృష్ణా ప్రాజెక్టుగా మార్చేస్తున్నారని ఆయన విమర్శించారు.
తమిళనాడులో తెలుగు భాషకు ఏర్పడిన గండాన్ని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు లేఖ రాసినా, మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వెళ్లి స్యయంగా కలిసినా జయలలిత తన తీరును మార్చుకోలేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న తమిళ విద్యార్తుల విషయంలో తాము కూడా అలాగే నడుచుకుంటామని ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రకటించాలని ఆయన కోరారు.