నాడు వైఎస్.. నేడు జగన్ .. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు సముచిత స్థానం .. రీజన్ ఇదే
ఏపీ లోని జగన్ సర్కార్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ను అధికార భాషా సంఘం అధ్యక్షునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారని తెలుస్తుంది. మంగళవారం జివో ఎంఎస్ నెంబర్ 10ను విడుదల చేసిన పర్యాటక శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధికార భాషా సంఘంలో నలుగురు సభ్యులను కూడా నియమించే వెసులుబాటును కూడా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు కల్పించారు.
అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు కీలక పదవినిచ్చిన సీయం జగన్
తెలుగు, హిందీ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేసిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ఈ పదవిని ఇచ్చి సముచితంగా గౌరవించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. నాడు వైయస్సార్ ఏ విధంగా అయితే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా నియమించి గౌరవించారో అదే తరహాలో నేడు తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ఆంధ్ర ప్రదేశ్ అధికార భాష సంఘం చైర్మన్ గా అవకాశమిచ్చి గౌరవించారు. ఇక యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజ్యసభ సభ్యునిగా నూ పని చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు యార్లగడ్డ. తెలుగు సాహిత్యం ఉత్తరాది వారికి అర్థం కావాలంటే, దాని గొప్పతనం తెలియాలంటే మన సాహిత్య ప్రక్రియలను హిందీలోకి అనువదింపచేయాలన్న ఆలోచనలకు ఆద్యునిగా ఉన్నారాయన. అష్టావధానం, శతావధానం వంటి ప్రక్రియలను అనువదించి హిందీలో ప్రచురింపచేయటం ద్వారా మన తెలుగు గొప్పదనాన్ని ఉత్తరాదికి పరిచయం చేసారు లక్ష్మి ప్రసాద్.
ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు... చంద్రబాబును అనుక్షణం వ్యతిరేకించే యార్లగడ్డ ...
ప్రస్తుతం ఆచార్య యార్లగడ్డ ప్రధాని నరేంద్ర మోడీ ఛైర్మన్గా ఉన్న కేంద్రీయ హిందీ సంస్ధలో సభ్యులుగా సేవలు అందిస్తున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాష సాహిత్యం, సంస్కృతి వికాసానికి ఎంతో కృషి చేసిన యార్లగడ్డ వివిధ దేశాలలో తెలుగు మహాసభలను నిర్వహించారు. తెలుగు భాషా సాహిత్యాలను హిందీలో అనువదింపజేసి అవి దేశ రాజ భాష హిందీకి కూడా ప్రాచుర్యం కల్పించారు. తెలుగు హిందీ భాషల్లో డాక్టరేట్ అందుకున్న యార్లగడ్డ కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వానపాముల లో జన్మించారు. జయేంద్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జైలు జీవితాన్ని సైతం గడిపారు. దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించి ఎన్టీఆర్ కు హిందీ భాష నేర్పించాడు. చంద్రబాబు అస్తిత్వాన్ని నాటి నుండి నేటి వరకు నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉన్న యార్లగడ్డ చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారాడు. గత ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యార్లగడ్డ వైయస్ జగన్ ను కలిశారు. జగన్ అధికారంలోకి రావాలని గట్టిగా ఆకాంక్షించారు.
తండ్రి బాటలో నడుస్తున్న తనయుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్న యార్లగడ్డ
ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు. దీంతో జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తండ్రి బాటలో నడుస్తున్న తనయుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో రాజభాషగా తెలుగు భాషను అమలు చేసే విధంగా తెలుగు భాష ఉన్నతికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన నేపథ్యంలో తాను కూడా అమెరికా వెళ్లనున్నట్లు చెప్పిన యార్లగడ్డ ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆ తన వంతు సేవలందించడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.