చంద్రబాబూ! కేసీఆర్ను చూసి నేర్చుకో: యార్లగడ్డ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ వరకు తెలుగు భాష తప్పనిసరి విషయంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావును చూసి నేర్చుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు హితవు పలికారు.
ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు వ్యక్తిగా ఎంతో గర్విస్తున్నానని అన్నారు. ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు.
ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేస్తామని మూడేళ్లుగా చెబుతున్న చంద్రబాబు.. ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఏటా గిడుగు రామ్మూర్తి జయంతి రోజు సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తామని చెబుతున్నా.. ఆచరణలో విఫలమయ్యారని దుయ్య బట్టారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, శిలాఫలాకాలను తెలుగులోనే ముద్రించాలని జీవో జారీ చేసినా అమలు కావడం లేదని యార్లగడ్డ మండిపడ్డారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని గోదావరి పుష్కరాల చివరి రోజున చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఇప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదని అన్నారు.