కవిత వచ్చినా గెలుస్తా: యాష్కీ, తెరాసపై నారాయణ ఫైర్
నారాయణతో కెకె చర్చలు
కాంగ్రెస్తో సిపిఐ పొత్తు కుదుర్చుకుంటున్నాయనే వార్తలు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అప్రమత్తమైంది. సోమవారం ఉదయం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో తెరాస పొత్తుల కమిటీ చైర్మన్ కె కేశవ రావు, మాజీ ఎంపీ వినోద్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం కెకె మాట్లాడారు. పొత్తుల విషయంలో సిపిఐ పార్టీతో సానుకూల వాతావరణంలోనే చర్చలు జరిగాయన్నారు. సిపిఐ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై పార్టీలో చర్చించి తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
తాను కాంగ్రెస్లో చేరుతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై తెరాస నుంచి ఇంకా స్పష్టత రాలేదని సిపిఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా తెలిపారు. రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కలసి పోటీ చేస్తామన్నారు. పొత్తులపై తెరాస కాలయాపన చేస్తోంది తప్ప పారదర్శకంగా వ్యవహరించడం లేదని నారాయణ ఆరోపించారు.
సిట్టింగ్ సీట్ల విషయంలో తాము క్లియర్గా ఉన్నామని, ఆ విషయంలో చర్చలు లేవన్నారు. మరోసారి నిర్దిష్ట ప్రతిపాదని ఇచ్చామని, సాయంత్రంలోపు తేల్చాలన్నారు. 15 రోజుల క్రితం ఇచ్చిన జాబితాను చర్చించకుండా, మళ్లీ కొత్తగా చర్చలు అంటున్నారన్నారు. ఫోన్ చేస్తే స్పందించలేని స్థితిలో తెరాస నాయకత్వం ఉందా? అన్నారు.
నామినేషన్లపై జెసి
ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరిన జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. కేవలం డబ్బు కోసమే కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు వేస్తున్నారని, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డబ్బు కోసమే నామినేషన్లు దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు.