సర్వేల జాతర: ఏపీలో వైసీపీ హవా..కూలిన టీడీపీ కోట..జనసేన ఎక్కడుందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈ హీట్ మరింత ఊపందుకుంది. ఇప్పటికే అక్కడ ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సంగ్రామం కోసం సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు సర్వేలు ఫలానా పార్టీ విజయం సాధిస్తుందని చెబుతూ ఈ ఎన్నికలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. ప్రముఖ జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ సీఓటర్ సంయుక్తంగా పార్లమెంట్ స్థానాలపై నిర్వహించిన సర్వేలో ఏపీలో యువజన శ్రామిక రైతు పార్టీ (వైసీపీ) మొత్తం 25 సీట్లకు గాను 21 సీట్లు నెగ్గుతుందని పేర్కొంది. మిగతా నాలుగు సీట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లనున్నట్లు సర్వే పేర్కొంది.
ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో గడ్డు పరిస్థితి
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడంతో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోనుందని సర్వే వెల్లడించింది. అక్కడ రాజకీయాలు రోజుకో ట్విస్టు తీసుకుంటున్న నేపథ్యంలో ఎన్నికలు ఆసక్తి కరంగా మారనున్నాయని సర్వే చెప్పింది. మరోవైపు ఏపీలో టీడీపీ ఎన్డీఏ పార్టీ నుంచి బయటకు రావడంతో బీజేపీ అక్కడ ఒక్క సీటుకూడా నెగ్గదని సర్వే చెబుతోంది. 2014లో బీజేపీతో కలిసి టీడీపీ బరిలో దిగినప్పుడు 15 సీట్లు గెల్చిందని.. ఇప్పుడు ఒంటరిపోరుతో ఆ సంఖ్య 4సీట్లకే పరిమితం కానుందని జోస్యం చెప్పింది రిపబ్లిక్ టీవీ సీఓటర్ సంయుక్త సర్వే.
బీజేపీ దూరం కావడంతో చంద్రబాబుకు 11 సీట్లలో ఓటమి
ఇక ఓటు శాతానికి వస్తే 2014లో ఎన్డీఏతో కలిసి పోటీచేసిన టీడీపీ 40 శాతానికి పైగా ఉంటే... ఇప్పుడు అది 31.4 శాతానికి పడిపోయిందని సర్వే స్పష్టం చేసింది. అంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో దూరం అవడం వల్ల దాదాపు 11 సీట్లు కోల్పోవాల్సి వస్తోందని సర్వే స్పష్టం చేసింది. ఇక్కడ 9.4శాతం ఓటుశాతం కూడా టీడీపీకి దూరం అవుతోందని వెల్లడించింది.అంతేకాదు సానుభూతి ఓట్లు పడుతాయని భావించిన చంద్రబాబుకు ఓటరు చేదు అనుభవాన్ని మిగల్చనున్నారని సర్వే తెలిపింది. మరోవైపు వైసీపీ ఓటు షేరు కూడా 45.4శాతం నుంచి 41.9 శాతానికి పడిపోనున్నట్లు సర్వే పేర్కొంది.అంతేకాదు 2014లో 8 సీట్లు గెల్చుకున్న వైసీపీ తాజాగా 21 సీట్లుకు ఎగబాకి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.
కాంగ్రెస్ టీడీపీ కలిస్తే పిక్చర్ ఎలా ఉంటుంది..?
ఇప్పటికే మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ ఏకమవుతున్న నేపథ్యంలో ఏపీలో కూడా రెండు బద్ధ శత్రులు టీడపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తే ఫ్యాక్టర్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒక్క సీటు కూడా దక్కించుకోని కాంగ్రెస్...టీడీపీతో కలిసి బరిలోకి దిగితే 4సీట్లు గెలుస్తుందని సర్వే వెల్లడించింది. ఇక టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే 4 సీట్లు గెలుస్తుండగా... కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తే 8 సీట్లు దక్కించుకుంటుందని సర్వే పేర్కొంది. దీంతో ఇద్దరి సంఖ్య కలిసి 12కు చేరుకుంటుందని రిపబ్లిక్ టీవీ సీఓటర్ సర్వే పేర్కొంది. అయితే రాహుల్ గాంధీ చంద్రబాబును ఎలా డీల్ చేస్తారనేదానిపైనే పిక్చర్ ఆధారపడి ఉంటుందని సర్వే నిపుణులు చెబుతున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఉండరు
బలమైన నాయకుడిగా అవతరిస్తున్న వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలంటే...రాహుల్ గాంధీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోక తప్పదని సర్వేనిపుణులు చెబుతున్నారు. సున్నా సీట్ల కంటే 4 సీట్లయినా కాంగ్రెస్కు దక్కుతుందని వారు చెబుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ టీడీపీలు కలిసి పోటీచేస్తే వారి సీట్ల సంఖ్య 12కు చేరుకుంటుంది అంటే వైసీపీ 13 సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో జగన్ చాలా కోల్పోవాల్సి ఉంటుందని స్ట్రాటజిస్ట్లు పేర్కొంటున్నారు. అందుకే ఏపీలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు తిరిగి జీవం పోసుకోవాలంటే టీడీపీ హస్తం పార్టీల కలయిక తప్పదని ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తేనే కాంగ్రెస్కు కాస్త పరువుదక్కుతుందని స్ట్రాటజిస్ట్లు చెబుతున్నారు.