పట్టాభి ఇల్లు - టీడీపీ కార్యాలయంపై దాడులు : వైసీపీ నేతలను తిట్టటంతో - గవర్నర్ కు బాబు ఫిర్యాదు ..!!
టీడీపీ నేత పట్టాభి ఇంటి పైన దాడి జరిగింది. కొద్ది సేపటి క్రితం విజయవాడలో ఇంటి పైన దాడి జరిగింది. ఇంటి వద్దకు వచ్చిన కొందరు మహిళలు..యువకులు పట్టాభి ఇంటి వద్దకు చేరుకున్నారు. పట్టాభి ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఆయన లేరని చెప్పగానే...ఇంట్లోకి వస్తూనే బయట ఉన్న కారును ధ్వంసం చేసారు. ఆ వెంటనే ఇంట్లోకి ప్రవేశించి టీవీ..బీరువా...ఫర్నీచర్ ధ్వంసం చేసారు. అదే విధంగా ప్రతీ పరికరాన్ని ధ్వంసం చేసారు. గతంలోనే దాడి జరిగిన సమయంలో కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవటంతో పాటుగా... సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకున్నారు.
పెద్ద సంఖ్యలో మహిళలు..యువకులు వచ్చి దాడులు
అయితే, ఈ దాడికి ముందుగా పట్టాబి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి వైసీపీ శ్రేణులే చేసారని ఆరోపిస్తున్నారు. బూతులు తిడుతూ లోపలకు వచ్చారని ..చంపేస్తామంటూ ధ్వసం చేసారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే పట్టాభి మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గంజాయి స్మగ్లర్లు పొరుగు రాష్ట్ర పోలీసుల పై దాడి చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే..తెలంగాణ - తమిళనాడు పోలీసులకు నోటీసులు ఇవ్వండంటూ పట్టాభి వ్యాఖ్యానించారు.
టీడీపీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం
తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మ అంటూ... తెలంగాణ పోలీసులకు ఇవ్వరా నోటీసు అంటూ ..గుంటూరు ఎస్పీకి ఇవ్వు నోటీసులు..నక్కా ఆనందబాబు కు ఇస్తావా నోటీసులు.. అంటూ దూషించారు పట్టాభి. ముఖ్యమంత్రి నుంచి వైసీపీ నేతల కొమ్ము కాస్తున్న గంజాయి స్మగ్లర్లు పోలీసుల పై బాంబు దాడులు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీంతో..వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పట్టాభి ఇంటి పైనా..అదే విధంగా మంగళగిరి సమీపంలోని టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది. అక్కడ ఉన్న వాహనంతో పాటుగా లోపల ఫర్నీచర్ పైన దాడి జరిగింది. ఇక, దీని పైన వెంటనే చంద్రబాబు స్పందించారు. గవర్నర్ కు ఫోన్ చేసారు. పార్టీ కార్యాలయం ..పట్టాభి ఇంటి పైన జరిగిన దాడుల గురించి ఫిర్యాదు చేసారు.
Recommended Video
విశాఖ...కర్నూలు కార్యాలయాల వద్ద నిరసనలు
విశాఖ టీడీపీ ఆఫీసు ముందు వైసీపీ కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. అదే విధంగా కర్నూలు కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన నిర్వహిస్తున్నారు. కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు రానున్నారు. ఇప్పటికే గవర్నర్ తో మాట్లాడిన చంద్రబాబు..పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడిని వివరించారు. ప్రొద్దుటూరు కార్యాలయం వద్ద నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల పైన టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలే జనాలను పంపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.