బీజేపి ద్రోహానికి వైసీపి సహకారం ...ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్..
Recommended Video
అమరావతిలో జరుగుతున్న మహానాడు లో చంద్రబాబు కుమారుడు లోకేష్ ప్రతిపక్ష పార్టీ వైసీపిని, కేంద్ర బీజేపి పైన విమర్శలు కురిపించారు.రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహానికి వైసీపి సహకరిస్తోందని ఆరోపించారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన వైసీపి అదే పార్టీతో చేతులు కలిపి తెలుగుదేశం ప్రభుత్వం పైన నిందలు మోపే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు లోకేష్.
2019 లో దొంగదెబ్బ తీసేందుకు వైసీపి ప్రయత్నాలు చేస్తోంది..
తెలుగు ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతున్న బిజెపి ప్రభుత్వమే ప్రధాన శత్రువని చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు అభివర్ణించారు. మహానాడు వేదికగా కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన లోకేష్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చురకలు అంటించారు. 2014లో ప్రత్యక్షంగా పోరాటానికి దిగిన వైసీపి, 2019 లో దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. 2014,2019 సార్వత్రిక ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందని 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే ప్రధానశతృవని లోకేష్ పేర్కొన్నారు. బలహీన పరిస్థితుల్లో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని విమర్శించడం సమంజసం కాదని అన్నారు.
విమర్శించడం తప్ప అభినందించడం జగన్ కు చేత కాదు..
భారతీయ జనతాపార్టీ ధ్వంధ ప్రమాణాలను అనుసరిస్తూ ద్రోహం చేస్తోందని అందుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దోహదం చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని భారతీయ జనతాపార్టీకి గాని ఏ ఒక్కరు ఓటు వేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రణాళికలకు అడ్డు తగలడమే తప్ప మరోపని జగన్ కు చేతకాదని విమర్శించారు. వైసిపి హాయంలో జరిగిన అవినీతిని ప్రక్షాళన చేస్తూనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని తెలిపారు.
సమిష్టి పోరాటం చేయాల్సిన చోట వంచన రాజకీయాలకు పాల్పడతారా...
రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను అమలు పరచడంలో అధికార పార్టీతో కలిసి అడుగు వేయాల్సిన జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే సార్వత్రిక ఎన్నికలుఒక ఏడాది ముందుగానే వచ్చినట్లు అనిపిస్తుందని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో స్పష్టమైన వైఖరితో, అవినీతి రహితంగా వ్యవమరిస్తుంటే నిధులు పక్కదారి పట్టాయని వైసిపి కేంద్రానికి లేఖలు రాయుడం కూడా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.68 ఏళ్ల వయస్సులో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం 18 గంటలు కష్ట పడుతున్నారని అయినప్పటికీ కేంద్ర సహకారం ఏమి లేదని విమర్శించారు. విభజన చట్టంలో పొందు పరిచిన హామీలు కూడా నెరవేర్చకుండా కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న విధానాలను తెలుగు ప్రజలు అర్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజాకోర్టులో శిక్ష పడక తప్పదు... సిద్దంగా ఉండండి..
రాష్గ్రాలన్నింటినీ సమానంగా చూస్తామన్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనకు విరుద్దంగా ప్రధాని మోడీ అమీత్ షాలు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. కేంద్రం దృష్టిలో అన్నిరాష్ట్రాలు సమానమైతే రెండు తెలుగు రాష్ట్రాల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారని కేంద్రాన్నిప్రశ్నించారు. సాక్షాత్తు వెంకన్నసన్నిధిలో ఇచ్చిన హామీని కూడా మోడీ మర్చి పోయారంటే ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చని లోకేష్ తెలిపారు. మహానాడులో మౌలిక సదుపాయాల తీర్మానంపై ప్రసంగించిన ఆయన బిజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అటు బిజెపిని, బిజెపికి సహకిరిస్తున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు లోకేష్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి, రాష్ట్రాంలో వైసిపి ఘోర పరాజయం పాలవుతాయని జోస్యం చెప్పారు నారా లోకేష్.