అధికారంలోకి వస్తే స్పీకర్ ఎవరో డిసైడ్ చేసిన వైసీపీ ! బాబుకు ఆయనే కరెక్ట్ అట..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఎవరి లెక్కలు వారు వేసుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక గెలుపుపై వైసీపీలో ధీమా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ కూడా ప్రజలు మరోసారి తమకు పట్టం కడుతున్నారని జోస్యం చెబుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ అప్పుడే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
గెలుపుపై వైసీపీ ధీమా..లోటస్పాండ్కు నేతల క్యూ
ఏపీలో ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఎన్నికలు జరిగి 10 రోజులు ముగుస్తున్నప్పటికీ ఇంకా ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ఆగలేదు. ఎన్నికల కమిషన్కు ఇంకా పార్టీల నేతలు వెళ్లి ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. ఇక పోలింగ్ భారీగా జరగడంతో అది ప్రభుత్వ వ్యతిరేకత అని అది తమకు కలిసొస్తుందని వైసీపీ భావిస్తోంది. కచ్చితంగా గెలుపు తమదే అని వైసీపీ నాయకులు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు లోటస్ పాండ్కు క్యూకడుతున్నారు.
గెలుపు గుర్రాలపై జగన్ సమీక్ష
ఇక వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉన్న అధినేత జగన్ ఇప్పటికే తన వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాలో గెలుపు గుర్రాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. సామాజకి ఈక్వేషన్స్ను కూడా పరిగణలోకి తీసుకుని బెస్ట్ కేబినెట్ తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే నేతలు లోటస్పాండ్కు క్యూకడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లోటస్ పాండ్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది.
స్పీకర్ పదవికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ?
ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే స్పీకర్గా ఎవరుంటారన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి స్పీకర్ పదవికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరు వినిపిస్తోంది. ఒకప్పుడు అసెంబ్లీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖం కనిపించకూడదు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ మీటింగ్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యూహంలో భాగంగానే దగ్గుబాటికి స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. దగ్గుబాటికి స్పీకర్ పదవి ఇస్తే ఇక చంద్రబాబు అధ్యక్ష అని పిలువక తప్పదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి అదే సమయంలో చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గెలుపుపై విశ్వాసమా..అతివిశ్వాసమా..?
మరోవైపు గెలుపుపై వైసీపీది విశ్వాసమా అతి విశ్వాసమా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన వైయస్ జగన్ సీఎం అని రాసి ఉన్న నేమ్ ప్లేట్ను ఫేక్ అని ఖండించిన పార్టీ... కేబినెట్ కూర్పుపై చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు ప్రచారంలో ఉంటుండగా ఎందుకు ఖండించడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. అంతేకాదు 2014లో కూడా జగన్ సీఎం అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ అది కాస్త బూమరాంగ్ అయ్యింది. మరి ఈ సారి కూడా వైసీపీదే గెలుపు అని చాలా సర్వేలు కోడై కూస్తున్నాయి. అయితే అవి ఎంతవరకు నిజమో తెలియాలంటే మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.