ఏపీలో రోజుకో రచ్చ... తమను చంపాలనే వైసీపీ కుట్రలు .. టీడీపీ ఫైర్
ఏపీలోని వైసీపీ,టీడీపీ నేతల మధ్య రోజుకో పంచాయితీ కొనసాగుతుంది. తాజాగా ప్రభుత్వం గతంలో మంత్రులుగా పని చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారికి సెక్యూరిటీ తొలగించాలని నిర్ణయం తీసుకోవటంతో పెద్ద దుమారమే రేగింది . రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు గత టీడీపీ హయాంలో పని చేసిన మాజీ మంత్రులకు , ఎంపీలకు భద్రత తొలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేయటంపై టీడీపీ భగ్గుమంటుంది. కావాలని తమను చంపాలని వైసీపీ సర్కార్ చేస్తున్న కుట్ర అని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు .
టీడీపీ ప్రజా చైతన్య యాత్ర... చంద్రబాబు భద్రతపై ఆసక్తికర చర్చ
భద్రత విషయంలో టీడీపీ , వైసీపీ మధ్య రగడ
టీడీపీ హయాంలో మంత్రులుగా ఉన్న వారికి , మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు ఉన్న గన్మెన్లను తొలగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో టీడీపీ నిప్పులు చెరుగుతుంది . భద్రత తొలగింపు వెనుక కుట్ర వుందని టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ . ఈ అంశాన్ని సాక్షాత్తు మాజీ మంత్రి దేవినేని ఉమ లేవనెత్తారు. తెలుగుదేశం నేతలకు భద్రత తొలగింపు వెనుక ముఖ్యమంత్రి జగన్ కుట్ర వుందని ఆరోపించిన ఉమా జగన్, టీడీపీ నేతలపై కక్షతో రగిలిపోతున్నాడని వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలకు భద్రత తొలగించాలని సర్కార్ నిర్ణయం
ఇక చంద్రబాబు, లోకేశ్లను జైలుకు పంపాలని జగన్ కోరుకుంటున్నారని ఉమ అంటున్నారు.20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న తనకు భద్రత తొలగించడం ఏంటని, తమని చంపాలని చూస్తున్నారని దేవినేని మండిపడ్డారు. ఇక టీడీపీ నేతలుమాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబుకు భద్రతను తొలగించారు. స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే భద్రత తొలగించామని పోలీసులు చెబుతున్నారు.
కక్ష సాధింపు చర్యలు, చంపాలనే కుట్ర అంటున్న టీడీపీ
అయితే తమ భద్రత తొలగింపుపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు భద్రత కొనసాగించారని టీడీపీ నేతలు పేర్కొన్నారు . కావాలని కక్ష పూరితంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని, చంపాలని కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు . తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు, సమాచారం లేకుండా ఉన్నపళంగా భద్రత తొలగించడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు .
Recommended Video
చంద్రబాబు, లోకేష్ ల భద్రత విషయంలో టీడీపీ ఆగ్రహం
మరోవైపు చంద్రబాబు, లోకేష్ ల భద్రత విషయంలో కూడా టీడీపీ మండిపడుతుంది. చంద్రబాబుకున్న భద్రతను ఏ మాత్రం తగ్గించలేదని ఏపీ డీజీపీ ప్రకటించారు. కానీ టీడీపీ నేతలు చంద్రబాబు భద్రత విషయంలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా మరోమారు భద్రత విషయంలో మండిపడుతున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతల ప్రాణాలకు రక్షణ లేదని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి రోజుకో రచ్చ చేస్తూ టీడీపీ, వైసీపీ ల మధ్య వార్ కొనసాగుతుంది.