మరోసారి ప్రత్యేక హోదా నినాదం: అఖిపక్ష సమావేశంలో నినదించిన వైసీపీ : కేంద్రం ముందు వైసీపీ చిట్టా..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో..పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలు హాజరయ్యాయి. ఇదే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరింది. కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే అవకాశముంది.
చొరబాటుదారులు ఏరివేత లక్ష్యంగా దేశమంతా ఎన్నార్సీ అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఇక, లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ నుండి విజయ సాయిరెడ్డి..మిధున్ రెడ్డి హాజరయ్యారు. తమ పార్టీ నుండి సమావేశాల అజెండాలో చేర్చాల్సిన అంశాలను ప్రస్తావించారు.
విభజన చట్టంలో ప్రతిపాదనలకు మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ నేతలు అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేసారు. కొంత కాలంగా వైసీపీ ఈ నినాదం మీద వ్యూహాత్మకంగా మౌనం పాటించిన వైసీపీ తిరిగి ఆ నినాదాన్ని పార్లమెంటరీ ఆల్ పార్టీ మీటింగ్ లో తిరిగి ప్రస్తావించింది. టీడీపీ ఈ అంశం మీద సభలో ప్రస్తావించాలని నిర్ణయించటంతో..వైసీపీ ఈ సమావేశంలోనే ప్రస్తావించి..అజెండాలో చేర్చాలని కోరింది.
ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన నిధుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలని వైసీపీ నుండి హాజరైన విజయ సాయి రెడ్డి..మిధున్ రెడ్డి డిమాండ్ చేసారు. ఇక, పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు వారు తమ పార్టీ డిమాండ్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రికి నివేదించారు.
రాష్ట్ర విభజన నాటి నుండి భర్తీ కాకుండా ఉండిపోయినా..రూ. 18,969 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ ఆ మేరకు ఏపీకి నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ. 700 కోట్ల గ్రాంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఆంధ్రప్రదేశ్కు ఏడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని వైసీపీ నేతలు కేంద్రాన్ని కోరారు.
ఇక, రామాయపట్నంలో మేజర్ పోర్టును నిర్మించాలని..గిరిజన ప్రాంతమైన విజయనగరం జిల్లా సాలూరులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అనుమతించాలని అభ్యర్ధించారు. గోదావరి - కృష్ణా నదుల అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్ట్గా గుర్తించి కేంద్రమే చేపట్టాలని వైసీపీ పక్ష నేతలు కేంద్రం ముందు తమ పార్టీ నుండి ప్రధాన చర్చకు కోరకుంటున్న అంశాలుగా నివేదించారు.