ఈఎస్ఐ రికార్డులు తారుమారు చేసి .. అచ్చెన్నను ఇరికించారు : టీడీపీ నేతల ధ్వజం
టిడిపి ఎమ్మెల్యే,మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్ టిడిపిలో పెను దుమారానికి కారణమైంది.ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలంగా మారింది. టిడిపినేతలు ఇది వైసీపీ కక్షపూరిత చర్య అని, అసెంబ్లీ సమావేశాలకు అచ్చెన్నాయుడు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అని మండిపడుతున్నారు.
అచ్చెన్న అరెస్ట్ : జగన్ ది రాక్షసానందమన్న నారా లోకేష్ ; ఆజానుబాహుబలికి భయపడే అంటున్న బుద్ధా
ఎర్రన్నాయుడు కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చెయ్యాలనే కుట్ర : ఆలపాటి రాజా
ఈఎస్ఐ స్కామ్ లో రికార్డులను తారుమారు చేసి టీడీపీకి మకిలి అంటించడానికి కుట్ర పన్నుతున్నారని ఆలపాటి రాజా పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రభుత్వ పాలనకు ఇది పరాకాష్ట అంటూ పేర్కొన్నారు. టిడిపి ఆవిర్భావం నుండి ఎర్రన్నాయుడు కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలో బీసీ నాయకులైన వారు, బీసీ కులాలకు మార్గదర్శకులుగా ఉన్నారని ఆలపాటి రాజా పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబాన్నిరాజకీయాల్లో లేకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించిన ఆలపాటి రాజాఈనెల 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైప్రశ్నిస్తాడనే భయంతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసారని వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.
అచ్చెన్న అరెస్ట్ బలహీన వర్గాలను వేధించటమే : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అచ్చెన్నాయుడు అరెస్ట్ ను మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో బీసీ కుటుంబానికి చెందిన రాజకీయనేతను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. టీడీఎల్పీ ఉపనాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడుతున్న కారణంగా అరెస్టుకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇలా అరెస్ట్ చేయడం కుట్రేనని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్రంలోనూ ఈఎస్ఐ కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలు వస్తే, కుంభకోణం జరిగితే నాడు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఇక్కడ ఏ మాత్రం డిపార్ట్మెంట్ విచారణ లేకుండానే మాజీమంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. ఇక అచ్చెన్న అరెస్ట్ బలహీన వర్గాలను వేధించడమేనని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
అనారోగ్యంతో ఉన్న అచ్చెన్న అరెస్ట్ రాకకీయ కక్ష సాధింపే : దేవినేని ఉమా
అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందించిన మాజీ మంత్రి దేవినేని ఉమా ఆయన అనారోగ్యంతో ఉన్నా తప్పుడు కేసులతో వందలాది మంది పోలీసులు కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారు. బీసీ వర్గాల పై దాడి కక్ష సాధింపు చర్య కాదా అంటూ దేవినేని ఉమా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న అచ్చెన్నాయుడు అరెస్ట్ ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ : కళా వెంకట్రావు
టిడిపి సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు బీసీ నాయకుడు కాబట్టే అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఆయన ప్రశ్నించారు. కక్షపూరిత చర్యలకు జగన్ సర్కార్ పాల్పడుతుంది అని చెప్పడానికి అచ్చెన్నాయుడు అరెస్ట్ నిదర్శనం అంటూ కళా వెంకట్రావు పేర్కొన్నారు.