అనంతలో జేసీ బ్రదర్స్ కు చెక్ .. ఆధారాలతో సహా జేసీ ట్రావెల్స్ టార్గెట్ గా ప్రభుత్వ పంజా !!
అనంతపురం రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ ను అధికార వైసీపీ టార్గెట్ చేసింది . జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు . ఒకటి కాదు రెండు కాదు జేసీకి సంబంధించిన వ్యాపారాలలో అక్రమాలు జరుగుతున్నాయని ఆధారాలతో ప్రూవ్ చేసే పనిలో పడింది వైసీపీ సర్కార్ .ముఖ్యంగా వారి ఆర్ధిక మూలాలపై వైసీపీ ప్రభుత్వం దెబ్బ కొడుతుంది. జేసీ బ్రదర్స్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఈ తాజా పరిణామాలు అనంతపురంలో జేసీ బ్రదర్స్ కు చెక్ పెట్టినట్టే అన్న చర్చకు కారణం అవుతున్నాయి.
జగన్ ది ఫ్యాక్షన్ సంస్కృతి .. చంపకుండా ఆర్ధిక మూలాలపై దెబ్బ కొడుతున్నారు : జేసీ దివాకర్ రెడ్డి
టీడీపీ నాయకుల అక్రమాలు బయటకు తెచ్చేపనిలో వైసీపీ సర్కార్
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీలో కీలక నాయకులను టార్గెట్ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వారు చేసిన అక్రమాలను బయటకు తెస్తుంది. అంతే కాదు కేసులు బనాయించి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది అన్నది టీడీపీ వాదన. ఈ నేపధ్యంలోనే గతంలో టీడీపీ నుండి వైసీపీపై విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు చాలా మంది సైలెంట్ అయ్యారు. ఎప్పుడు ఏం మాట్లాడాలి అన్నా ఆచి తూచి మాట్లాడుతున్నారు.
జగన్ మావాడే అని చెప్పుకున్నా జేసీ బ్రదర్స్ కు తప్పని తిప్పలు
ఇక అనంతపురం జిల్లా టీడీపీ కీలక నేతలు జేసీ బ్రదర్స్ చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో కొంతకాలం క్రితం వరకు జగన్ కు కితాబిస్తూనే మాట్లాడారు. మావాడే అని చెప్పుకున్నారు. అయినప్పటికీ వారి చుట్టూ సర్కార్ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది . జేసీ బ్రదర్స్ ను వైసీపీ సర్కార్ మాత్రం వదల బొమ్మాలీ అంటుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న జేసీ బ్రదర్స్ టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వం వారి ఆర్ధిక మూలాను దెబ్బ తీసే పనీలో బిజీగా ఉందని స్థానికంగా చర్చ జరుగుతుంది .
దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ .. గనుల లీజ్ క్యాన్సిల్
ఇక వివరాల్లోకి వెళ్తే జేసీ బ్రదర్స్ చాలా ఏళ్ల నుంచి ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నారు . వారు వంద బస్సులకుపైగానే ఇంటర్ స్టేట్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు . దివాకర్ ట్రావెల్స్ కు సంబంధించి బస్సుల నిర్వహణలో నియమ నిబంధనలు పాటించటం లేదని ఏపీ రవాణా శాఖ అధికారులు దివాకర్ ట్రావెల్స్ టార్గెట్ గా విరుచుకుపడుతుంది. ఇప్పటికే పలు బస్సులను సీజ్ చేసి, రూట్ల పర్మిట్లను రద్దు చేసి ట్రావెల్స్ విషయంలో ఆర్ధిక మూలాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత అనంతపురం జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన గనుల లీజుల్ని రద్దు చేసింది.లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుంది .
తాజాగా దివాకర్ ట్రావెల్స్ లో ఫోర్జరీ సంతకాల వ్యవహారం
ఇక ఇదే సమయంలో మరోమారు జేసీ బ్రదర్స్ కు సంబంధించిన ట్రావెల్స్ లో సంతకాల ఫోర్జరీ వ్యవహారం ,నకిలీ డాక్యుమెంట్లు , నకిలీ స్టాంప్ ల వ్యవహారం జేసీ ఫ్యామిలీకి పెద్ద ఇబ్బందిగా మారింది. జేసీ ట్రావెల్స్లో ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంతో జేసీ మెడకు ప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది. ట్రావెల్స్ సిబ్బంది కొందరు పోలీసులు, రవాణాశాఖ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకొని ల్యాప్టాప్, బయోమెట్రిక్ మెషిన్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
జేసీ ట్రావెల్స్ సీజ్ దిశగా అడుగులు .. కోలుకోలేని దెబ్బ కొడుతున్న సర్కార్
ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ఫోర్జరీ వ్యవహారంపై ఆరా తీస్తున్నారని సమాచారం .ఇక నేడు అధికారులు సాక్ష్యాధారాలను బయటపెట్టి మరీ జేసీ ట్రావెల్స్ ను సీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జేసీ సోదరులు తాడిపత్రిలో తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించారని ఇప్పటివరకు బయటకు వచ్చినవి రెండే ఎపిసోడ్ లని మూడో ఎపిసోడ్ త్వరలో బయటకు వస్తుందని పేర్కొన్నారు. అయితే ఇక ఇదంతా వైసీపీ సర్కార్ కక్ష సాధింపు చర్య అంటున్నారు జేసీ బ్రదర్స్ . ఇక ఈ నేపధ్యంలో రాజకీయంగా , ఆర్ధికంగా కోలుకోలేకుండా జేసీ బ్రదర్స్ ను టార్గెట్ చేశారన్న చర్చ అనంతలో సాగుతుంది. జేసీ పని అనంతలో అయిపోయినట్టేనని తాజా పరిణామాలతో చర్చ జోరుగా జరుగుతుంది.