చంద్రబాబుకు వైసీపీ సర్కార్ షాక్.. టీడీపీ కీలక నేతల భద్రత తొలగింపు..మండిపడుతున్న టీడీపీ
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం గతంలో మంత్రులుగా పని చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారికి సెక్యూరిటీ తొలగించాలని నిర్ణయం తీసుకుంది . రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు గత రాత్రి అనంతపురం జిల్లా మాజీ మంత్రి , ఎంపీలకు భద్రత తొలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో మంత్రులుగా ఉన్న వారికి , మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు ఉన్న గన్మెన్లను ఉపసంహరించుకోవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో టీడీపీ నిప్పులు చెరుగుతుంది.
టీడీపీ మాజీ మంత్రుల, ఎంపీల భద్రత తొలగించిన వైసీపీ సర్కార్
టీడీపీ నేతలకు భద్రత తగ్గించే పనిలో పడింది వైసీపీ సర్కార్ . దీంతో టీడీపీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది . ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు . ఇక కొందరికి భద్రతను తగ్గించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నేతల భద్రతను ప్రభుత్వం తొలగించింది.
ఆందోళనలో టీడీపీ నేతలు
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబుకు భద్రతను తొలగించారు. స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే భద్రత తొలగించామని పోలీసులు చెబుతున్నారు. అయితే తమ భద్రత తొలగింపుపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావాలని కక్ష పూరితంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు . తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు, సమాచారం లేకుండా ఉన్నపళంగా భద్రత తొలగించడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు .
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళకుండా కుట్ర అంటున్న టీడీపీ
గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు భద్రత కొనసాగించారని టీడీపీ నేతలు పేర్కొన్నారు . వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు భద్రతను తగ్గించిందని ఇప్పుడు పూర్తిగా తొలగించి ఇబ్బందులకు గురి చేస్తుందని నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లకుండా నిలువరించేందుకు ప్రభుత్వం భద్రతను తొలగించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు .