చంద్రబాబుకు షాక్ ఇచ్చిన వైసీపీ సర్కార్ .. చంద్రన్న కానుకలో అవినీతిపై విచారణకు ఆదేశం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సర్కార్ వరుస షాకులు ఇస్తుంది . వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపైనే దృష్టి సారించిన జగన్ మోహన్ రెడ్డి ఆయన హయాంలో ప్రవేశపెట్టిన చంద్రన్న కానుకపై విచారణకు ఆదేశించారు. చంద్రన్న కానుక లో అవినీతిపై నివేదికలు సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం గతంలో పండుగల సందర్భంగా పేదవారికి సరుకులు ఉచితంగా అందించింది. ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత ఈ పథకాన్ని పర్వవేక్షించారు. దాంతో విజిలెన్స్ అధికారులు వారిపై కూడా విచారణ చేపట్టనున్నారు. చంద్రన్న కానుక పథకం కింద ప్రజలకు సరఫరా చేసిన వస్తువుల నాణ్యతపై ఇంతకుముందు అనేక ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. చంద్రన్న కానుక కు సంబంధించి అన్ని అంశాలను, వివరాలను సేకరిస్తున్న విజిలెన్స్ అధికారులు, బ్యాగ్స్ టెండర్ పొందిన వ్యక్తుల గురించి వివరాలను సేకరిస్తున్నారు .
నిధుల విడుదల, సరుకుల నాణ్యతతో పాటు, పథకంలో అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందటంతోనే ఏపీ సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు .ఈ కేసు దర్యాప్తులో విజిలెన్స్ అధికారులు బిజీగా ఉన్నారని తెలిసింది. సర్కార్ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. విజిలెన్స్ అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం.