ఏపి రాజధాని తరలింపుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది : చంద్రబాబు నాయుడు
ఏపీ రాజధాని అమరావతిని మార్చేందుకు వైసీపి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణ చేశారు. ఇందు కోసం అమరావతి ముంపు ప్రాంతమని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతం అంటూనే అమరావతి నిర్మాణాన్ని కూడ ఆపేశారని అన్నారు. అవనిగడ్డలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఇందులో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేశారని చంద్రబాబు విమర్శించారు. అయితే రాజధానిని అమరావతి నుండి మార్చాలనే కుట్రతో ముంపు ప్రాంతాలుగా ప్రచారం జరుగుతుందని అన్నారు. అమరావతిని ముంచేందుకే క్రిష్ణా బ్యారేజీలో అదనంగా నీటిని నిల్వ ఉంచారని ఆయన ఆరోపణలు చేశారు. దీంతో పాటు రాజధాని నిర్మాణానికి ఎక్కువ నిధులు ఖర్చు అవుతాయని నిలిపి వేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.మరోవైపు అమరావతి నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన 33వేల ఎకరాల్లో అన్ని వసతులకు పోను ఇంకా 8వేల ఎకారల భూమి మిగులుతుందని, చివరకు ఆ భూములు అమ్మినా... ఖర్చు లేకుండా రాజధానిని నిర్మించవచ్చని ఆయన సూచించారు.
రాజధాని మార్పుకు వైసిపి చేసే కుట్రలను ప్రజలు అర్ధం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. దీనిపై ఎంతకైనా పోరాడాతామని అన్నారు.కాగా అంతకు ముందు మంత్రి బోత్స సత్యనారయణ సైతం రాజధాని నిర్మాణానికి అధిక వ్యయం అవుతుందని చెప్పారు. నిర్మాణంపై చర్చించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. దీంతో బోత్స వ్యాఖ్యలను సైతం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అందరికి అమోదయోగ్య ఉండేందుకే రాజధానిని అమరావతిలో నిర్మాణానికి పూపుకున్నామని అన్నారు.