సొంత పార్టీ ఎంపీకి సీఎం జగన్ షాక్: ఆదాల కాంట్రాక్టుపైన రివర్స్ టెండరింగ్: వార్నింగా..పారదర్శకతా..!
సొంత పార్టీ ఎంపీకీ ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డి నిర్వహిస్తున్న ప్రాజెక్టు కాంట్రాక్టు పైన రివర్స్ టెండరింగ్ చేపట్టారు. దీని ద్వారా దాదాపు రూ 1100 కోట్లు ఆదా చేశామని ప్రభుత్వం చెబుతోంది. దీనిని తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని చెప్పటానికి ఇదే పెద్ద ఉదాహరణ అని చెబుతున్నారు.
అయితే, ఇది ప్రభుత్వం సాధారణంగా అమలు చేస్తున్న రివర్స్ టెండింగ్ లో భాగంగా జరిగిందా..లేక సొంత పార్టీ ఎంపీకి షాక్ ఇచ్చేందుకే ఈ రకంగా చేసారా అనే చర్చ నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందు టీడీపీ నుండి వైసీపీలో చేరిన ఆదాల.. నెల్లూరు నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయితే, ఇప్పుడు సొంత ఎంపీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన వైసీపీ నేతల మధ్యే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సభలో ప్రకటించిన ప్రభుత్వం..
నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టుల గురించి సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అనిల్ కీలక సమాధానం ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని అనిల్ చెప్పారు. గత ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పట్టించుకోలేదని విమర్శించారు.
రివర్స్ టెండరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం ఆదా అయిందని సభలో వివరించారు. తమ సొంత పార్టీకి చెందిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నిర్వహిస్తున్న కాంట్రాక్టుపై కూడా రివర్స్ టెండరింగ్ చేపట్టామని మంత్రి తెలిపారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 1100 కోట్ల రూపాయలు ఆదా చేశామని వెల్లడించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ అని స్పష్టం చేశారు.
ఆదాలకు షాక్ ఇచ్చేందుకేనా..
టీడీపీ నుండి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలిచిన ఆదాల కు షాక్ ఇచ్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా అనే చర్చ మొదలైంది. ఎంపీగా ఎన్నికైన సమయం నుండి పార్టీ కార్యకలపాల కంటే తన వ్యాపారాల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ ముఖ్యుల వద్ద వినిపిస్తోంది.
అదే సమయంలో కేంద్రంలోని కొందరు పెద్దలతో సన్నిహితంగా మెలగటం కూడా చర్చకు కారణమైందని చెబుతు న్నారు. రాష్ట్ర..జిల్లా వ్యవహారాల కంటే వ్యాపారాలకే ప్రాధాన్యత ఇవ్వటం పైన పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహంతో ఉన్నట్లుగా అసెంబ్లీ లాబీల్లో చర్చ జరుగుతోంది. దీంతో..సీఎం జగన్ నిర్ణయం మేరకు గత ప్రభుత్వంలో కేటాయించిన అన్ని కాంట్రాక్టుల పైన నిర్వహిస్తున్న విధంగానే..ఆదాలకు కేటాయించిన వర్కుల పైన రివర్స్ టెండరింగ్ కు వెళ్లారని..ఇందులో ఎటువంటి రాజకీయ కారణాలు లేవని వైసీపీ ముఖ్య నేత చెబుతున్నారు. అయితే, రాజకీయంగా మాత్రం ఇది ఎంపీకి తొలి వార్నింగ్ లో భాగమేనని నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలే అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు.
సోమశిల హై లెవన్ కెనాల్ లో రివర్స్ టెండరింగ్..
సోమశిల హై లెవల్ కెనాల్కు సంబంధించి 2013లో రూ.1500 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని రాష్ట్ర నీటిపారుతల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ శాసనసభలో తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు కేవలం 2,690 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగిందన్నారు. ఫస్ట్ ఫేజ్ కింద రూ. 840 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
దీనిపైన ప్రభుత్వం తాజాగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా 67.9 కోట్లు ప్రజాధనం ఆదా చేసిన ప్రభుత్వం..రివర్స్ టెండరింగ్ తో 13.48 శాతం నిధులు మిగులు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. రూ. 527.53 కోట్ల పనులకు టెండర్ పిలిచిన ప్రభుత్వం..గతంలో 4.79 ఎక్సస్ కి టీడీపీ ప్రభుత్వం పనులు అప్పగించింది. ఇక, తాజా రివర్స్ టెండరింగ్ లో 8.69 శాతం తక్కువకు ట్రెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ త్వరలో పననులు ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు.