నందికొట్కూరు వైసీపీలో వర్గ పోరు .. దాడులు , కేసులు .. జగన్ వద్దకు చేరిన పంచాయితీ
కర్నూలు జిల్లా నందికొట్కూరులో వైసీపీ నాయకుల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ మధ్య విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారాయి . కింది స్థాయిలో మొదలైన పంచాయితీలు హత్యా యత్నాల వరకు వెళ్లడంతో స్థానిక వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇక ఈ పంచాయతీ ప్రస్తుతం జగన్ వద్దకు చేరడంతో జగన్ ఏం చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నందికొట్కూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
నందికొట్కూరు వైసీపీలో ముసలం .. స్థానికంగా చర్చ
నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ లు అధికార పార్టీలో కలిసి పనిచేస్తున్నా ఒకరిమీద ఒకరు అంతర్గతంగా కక్ష పెంచుకున్నారు. ఎన్నికల సమయం నుండి రెండు వర్గాలుగా పనిచేస్తున్న వైసీపీ నాయకుల మధ్య క్రమేపి గ్యాప్ పెరిగింది. స్థానికంగా పట్టున్న నాయకుడైన సిద్ధార్థ రెడ్డి నామినేటెడ్ పదవుల విషయంలో, ఇతర పనుల వ్యవహారంలో ఎమ్మెల్యే ను సంప్రదించినా పట్టించుకోని కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో వీరిద్దరి ఆధిపత్య పోరు పార్టీకి పెద్ద తలనోప్పిలా తయారైంది.
ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్న నేతలు
ఇక నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆధిపత్య పోరులో భాగంగా తరచూ ఘర్షణకు దిగుతున్నారు వైసిపి లోని ఇరువర్గాలు. ఎన్నికల వరకు పార్టీ కోసం అన్నీ తామే అయి పనిచేసినప్పటికీ, ఇప్పుడు తమ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారని , ఏకంగా తన పై కేసు నమోదు చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సిద్ధార్థరెడ్డిని పార్టీలోని ఒక వర్గం టార్గెట్ చేస్తున్నారని ఆయన అనుచరులు అటుండగా.. తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ చెప్తున్నారు. అయినా ఇరు వర్గాల మధ్య దాడులు, ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు .
ఇటీవల విద్యా కమిటీ ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ఇటీవల సెప్టెంబరు 26న మిడుతూరు మండలం తలముడిపి గ్రామంలో జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అదే రోజు రాత్రి ఎమ్మెల్యే వర్గానికి చెందిన పాతకోట వెంకటరెడ్డిపై నందికొట్కూరు శివారుల్లో కొందరు కాపుకాచి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటరెడ్డిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడిపై కేసు నమోదు విషయంలో పార్టీ రాష్ట్ర సంయక్త కార్యదర్శి రఘురామయ్య, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సిద్ధార్థరెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రఘరామయ్య పోలీసులపైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ దాడి ఘటనలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై ఏ 13 గా కేసు నమోదైంది. అయితే ఈ విషయంలో సిద్ధార్థ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు.
ఒకరిపై ఒకరు అధినేతకు ఫిర్యాదు .. పార్టీ నేతల ఘర్షణలపై జగన్ సీరియస్
నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్యపోరు పై, తమ అనుచరగణం పై చేస్తున్న దాడులపై ఆయన మండిపడుతున్నారు. ఎన్నికలైన కొద్దిరోజుల్లోనే తనపై పీడీ యాక్టు నమోదు చేయాలని ప్రయత్నించినట్లుగా చెబుతూ తగిన ఆధారాలు, వాయిస్ రికార్డులను కూడా అధినాయకత్వానికి అందించినట్లుగా ఉన్నట్లుగా సమాచారం. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ పలచన అవుతుందని, ఇటీవల జరిగిన దాడి కేసులోనూ ఇదే పరిస్థితి ఎదురైందని సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు.ఇక ఈ వ్యవహారమంతా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. ఇక వీరి ఘర్షణలపై సీరియస్ గా ఉన్న జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.