ఏపీలో అధికార పార్టీకి సవాల్ గా ఏకగ్రీవాలు .. మంత్రులు, ఎమ్మెల్యేల ముందే వైసీపీ గ్రూప్ 'పంచాయితీలు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ఒక పక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేసే దిశగా పనిచేయాలని పార్టీ నేతలకు ఆదేశాలను జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రులు ,ఎమ్మెల్యేలకు గ్రామాల్లో గ్రూపు పంచాయితీలు చుక్కలు చూపిస్తున్నాయి. అధికార పార్టీ నుండి పంచాయతీ ఎన్నికల బరిలో నిలవడానికి ఎక్కువ మంది ఆశావహులు పోటీ పడుతున్న వేళ ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది అన్నచందంగా పరిస్థితి తయారైంది.
పంచాయతీ వార్ : సీఎస్ కు నిమ్మగడ్డ మరో లెటర్: నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారే ఈ సారి టార్గెట్
వైసిపి మంత్రులకు ,ఎమ్మెల్యేలకు కత్తి మీద సాములా మారిన పంచాయతీ పోరు
గ్రామాలను ఏకగ్రీవ పంచాయతీలుగా మార్చడం వైసిపి మంత్రులకు ,ఎమ్మెల్యేలకు కత్తి మీద సాములా గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీ నేతలను పోటీ చేయకుండా నిలుపుదల చేయడం, లేదా వారిని తమవైపు తిప్పుకోవడం కోసం అధికార పార్టీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో సొంత పార్టీలో గ్రామాలలో ఉన్న గ్రూపు రాజకీయాలను కంట్రోల్ చేయటం వారికి పెద్ద ఇబ్బందిగా మారుతోంది.
అధికార పార్టీలోనే పోటీ చెయ్యటానికి ఆశావహుల పోటీ .. ఏకగ్రీవాలకు ఇబ్బందిగా పరిస్థితి
గ్రామాలలో పంచాయతీ సర్పంచ్ పదవిని ఆశించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆశావహులు పోటీ నుంచి విరమించమంటే ససేమిరా అంటున్నారు. పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడి మాకు ఎలాంటి పదవులు వద్దా ? మీరు మాత్రం పదవులు ఎంజాయ్ చేస్తారా ? మీ వర్గానికే పదవులా ? అంటూ బాహాటంగానే నేతలను నిలదీస్తున్నారు.
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రతి జిల్లాలోనూ వైసిపి ముఖ్య నాయకుల మధ్య చాలాచోట్ల విభేదాలున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామాలలో కూడా వర్గపోరు ప్రధానంగా కనిపిస్తుంది.
అశావహులను బుజ్జగించటం మంత్రులు , ఎమ్మెల్యేలకు తలకు మించిన భారం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండే అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికలకు దిగాలని ప్రయత్నం చేస్తుంటే, వారిని బుజ్జగించడం మంత్రులకు, ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఉప్పు నిప్పులా మండిపడే వైరి వర్గాలకు చెందిన గ్రామ స్థాయి నాయకులు ఏకగ్రీవాలకు అస్సలు ఒప్పుకోవటంలేదు. ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని తేల్చి చెబుతున్నారు. దీంతో ఈ గ్రూపుల మధ్య రాజీ కుదర్చడం వైసీపీ నేతలకు సాధ్యం కావడం లేదు.
చిత్తూరు జిల్లాలో గ్రామాల్లో పట్టు కోసం వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యేల వ్యూహాత్మక అడుగులు
ఉదాహరణకు చిత్తూరు జిల్లాను తీసుకుంటే చిత్తూరు జిల్లాలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా వీరు ఎవరి మధ్య సఖ్యత లేదు. ఇక వీరి మధ్య ఉన్న ఘర్షణలు క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య కూడా అలాగే కొనసాగుతున్నాయి. నియోజకవర్గాలలో మండల స్థాయిలో గ్రూపులు ఏర్పడి ఎవరికి వారు గ్రామ స్థాయిలో పట్టు కోసం పెద్ద ఎత్తున యుద్ధమే చేస్తున్నారు. ఇక గ్రామాలను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నం చేస్తున్న మంత్రులకు ,ఎమ్మెల్యేలకు పోటీ చేసి షాక్ ఇస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి .. అందరిని ఏకతాటి మీదకు తెచ్చి ఏకగ్రీవాలు చెయ్యటం పెద్ద టాస్క్
వీరిని బుజ్జగించడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు నానా చావు చస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎన్నికలు జరుగుతున్న చాలా గ్రామాలలో కనిపిస్తుంది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీ విమర్శలను తిప్పి కొట్టడం, మరోపక్క ఎన్నికల కమిషన్ తో యుద్ధం చేయడంతోపాటుగా , సొంత పార్టీలో నేతలను బుజ్జగించడం , గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేయడం కోసం ప్రయత్నం చెయ్యటం, అందరిని ఏకతాటి మీదకు తెచ్చి పోటీ లేకుండా చెయ్యటం వైసీపీ నేతలకు అన్నిటికంటే పెద్ద టాస్క్ గా మారింది.
Recommended Video