దగ్గుపాటికి ఆవిషయంలో ఎటో తేల్చుకోవాలని వైసీపీ అధిష్టానం అల్టిమేటం: కారణాలు ఇవే
ప్రకాశం జిల్లా పర్చూరు రాజకీయాలలో దగ్గుపాటి రాజకీయ ప్రస్థానం ఇప్పుడు హాట్ టాపిక్ . గత ఎన్నికల ముందు వైసీపీలోకి చేరి చంద్రబాబుకు చెక్ పెట్టాలని చూసారు దగ్గుపాటి వెంకటేశ్వర్ రావు .కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. దగ్గుపాటి ఓటమి పాలు కావటం , దగ్గుపాటి వల్ల పార్టీలో కీలక నేతలు ఇబ్బంది పడటం, ఇక బీజేపీలో ఉన్న పురంధరేశ్వరి అధికార పార్టీపై చేస్తున్న విమర్శలు వంటి కారణాలు ఆయనకు పొగ పెట్టాయి. చివరకు వైసీపీ దగ్గుపాటికి అల్టిమేటం జారీ చేసేలా చేశాయి. ఇక అసలు విషయానికి వస్తే..
దగ్గుపాటి ఫ్యామిలీ రెండు పార్టీల రాజకీయంపై వైసీపీ గరంగరం
దగ్గుపాటి ఫ్యామిలీ రెండు పార్టీల రాజకీయంపై వైసీపీ గరంగరంగా ఉన్నట్టు తాజా పరిణామాల నేపధ్యంలో తెలుస్తుంది. గడచిన ఎన్నికల్లో ఏ పార్టీలో చేరాలి అని ఊగిసలాడిన దగ్గుపాటి చివరకు వైసీపీలో చేరారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయన భార్య పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఇరువురూ ఓటమి పాలయ్యారు.. ఎన్నికలకు ముందు భార్యాభర్తలు చెరో పార్టీలో కొనసాగుతామని చెప్పటంతో అప్పట్లోనే జగన్ కాసింత అసహనం వ్యక్తం చేశారు. భర్త వైసీపీలో , భార్య బీజేపీలో ఉంటె బాగోదని సూచించారు. ఇక వీరు రెండు పార్టీల్లో ఉండటంపై పలు విమర్శలను సైతం ఎదుర్కొన్నారు .
బీజేపీకి పురంధరేశ్వరి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని దగ్గుపాటిపై ఒత్తిడి
కానీ దగ్గుపాటి ఫ్యామిలీలో పురంధరేశ్వరి బీజేపీలోనే, దగ్గుపాటి, ఆయన కుమారుడు ఇద్దరూ వైసీపీలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ , ఇప్పుడు గత ఎన్నికల్లో ఓటమిపాలు కావటంతో ఏదో ఒక పార్టీని ఎంచుకోవాలని అదే పార్టీలో ఫ్యామిలీ కొనసాగాలని దగ్గుపాటిపై ఒత్తిడి తెస్తోంది వైసీపీ అధిష్టానం . గత ఎన్నికల్లో దగ్గుపాటి ఓటమికి కారణం అయిన రామనాధం రీ ఎంట్రీ, పార్టీ నేతలతో దగ్గుపాటి తీరు సరిగ్గా లేకపోవటంతో ఆయనపై వైసీపీ అధిష్టానం సైతం కాసింత విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.
జగన్ పై విమర్శలు చేస్తున్న పురంధరేశ్వరి తీరే కారణం
పురందేశ్వరితో బీజేపీకి రాజీనామా చేయించాలని భావిస్తున్నవైసీపీ, ఆమెను సైతం వైసీపీ తీర్ధం పుచ్చుకునేలా చెయ్యాలని దగ్గుపాటిని కోరుతుంది. అలా చేస్తే పురంధరేశ్వరి నోటికి తాళం వేసినట్టు అవుతుందని భావిస్తుంది. ఇక బీజేపీ నేతగా ఉన్న పురంధరేశ్వరి జగన్ సీఎం అయిన తరువాత, ఏపీ సర్కారుపైనా, జగన్ పైనా విమర్శలు చేస్తున్నారు. ఈ తీరు జగన్ పార్టీ నేతలకు ఏ మాత్రం నచ్చటం లేదు .ఈ వ్యవహారం పార్టీలో, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో దగ్గుపాటి ఫ్యామిలీ టార్గెట్ అయ్యేలా చేస్తుంది . దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటారో తేల్చుకోవాలని వైసీపీ అధిష్ఠానం అల్టిమేట్టం జారీ చేసింది.
బీజేపీని వీడే ఆలోచన లేని పురంధరేశ్వరి
ఇక జగన్ పార్టీ నేతలు కోరినట్టు పురంధరేశ్వరి అంత ఈజీగా బీజేపీని వీడి వచ్చే ఆలోచనలో లేరు. జాతీయ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, గతంలోనూ కేంద్రంలో మహిళా కీలక నేతగా ఉన్న పురంధరేశ్వరికి బీజేపీ ఏదైనా మంచి అవకాశం ఇచ్చే ఆలోచన ఉంది అని దగ్గుపాటి కుటుంబం భావిస్తుంది. ఇక ఈనేపధ్యంలో ఆమె బీజేపీని వీడే ఛాన్స్ లేదు. ఇక ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్ తో తేల్చుకోవాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నా అపాయింట్ మెంట్ లభించడం లేదని సమాచారం.
జగన్ అపాయింట్ మెంట్ కోసం దగ్గుపాటి యత్నం .. నో ఛాన్స్
గతంలో పరుచూరులో వైసీపీ ఇన్ చార్జ్ గా ఉండి, దగ్గుబాటి చేరిక తరువాత, టీడీపీలోకి వెళ్లిపోయిన రావి రామనాథం బాబు రీ ఎంట్రీ దగ్గుపాటి ఫ్యామిలీకి తిప్పలు తెచ్చి పెట్టింది. ప్రశుతం నియోజకవర్గంలో దగ్గుపాటి మాట చెల్లటం లేదు. రామనాధం రీ ఎంట్రీ తో క్రియాశీలకంగా పార్టీ పనులన్నీ ఆయనకే అప్పగిస్తున్నారు .ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న దగ్గుబాటి, తన అనుచరులతో మొత్తం పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ అపాయింట్ మెంట్ లభిస్తే, వెళ్లి అక్కడే తుది నిర్ణయం తీసుకోవాలని దగ్గుబాటి భావిస్తున్నా జగన్ అపాయింట్మెంట్ అంత ఈజీగా ఆయనకు దొరికే అవకాశం లేదని తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది.