శాసన మండలి రద్దు..! వైసీపీ అధిష్టానం యోచన: ఆశావాహుల్లో టెన్షన్..టీడీపీ కౌంటర్..!
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కొత్త రాజకీయ మలుపులకు కారణం అవుతోంది. మూడు రాజధానుల బిల్లులు శాసనసభలో ఆమోదం పొందిన తరువాత ఈ రోజు మండలిలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.దీనిని మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. గతంలో శాసనమండలి రద్దు ప్రతిపాదన పైన చర్చ సాగింది. అయితే, దాని పైన చర్చను నాడు పక్కన పెట్టారు. తిరిగి, ఈ రోజు శాసనసభా లాబీల్లో వైసీపీ నేతల మధ్య ఈ అంశం పైన సీరియస్ గా చర్చ సాగుతోంది. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన రెండు బిల్లును మండలి తిరస్కరించింది. ఈ రోజు అవే బిల్లుల పైన శాసనసభ లో తిరిగి ప్రవేశ పెట్టారు. ఇక, ఇదే సమయంలో ప్రభుత్వం లో జరుగున్న శాసనమండలి రద్దు ప్రతిపాదన..చర్చ పైన టీడీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అది సులువు కాదని చెబుతూనే..అదే జరిగితే వైసీపీలో చీలిక వస్తుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
శాసనమండలి రద్దు పైన చర్చ..
శాసనమండలిని రద్దు చేసే యోచన పైన అధికార పార్టీలో చర్చ సాగుతోంది. దీని పైన వైసీపీ అధిష్ఠానం సుదీర్ఘంగా చర్చిస్తోంది. దీని పైన కొద్ది రోజులుగా చర్చ సాగుతున్నా..దాని వలన వైసీపీకే రాజకీయంగా నష్టం జరుగుతుందనే అంచనాతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టేసారు. అయితే, శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు బిల్లలను మండలి తిరస్కరించింది. ఇంగ్లీషు మీడియం స్కూళ్లు..ఎస్సీ కమిషన్ బిల్లును వర్గీకరణకు సవరణ కోరుతూ తిరస్కరించింది. దీంతో..ప్రభుత్వం ఈ రెండు బిల్లులను ఈ రోజు తిరిగి శాసనసభలో ప్రవేశ పెట్టి ఆమోదానికి ప్రయత్నిస్తోంది. ఇక, ఇదే సమయంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల బిల్లు విషయంలో నూ మండలిలోనే టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బిల్లులను మండలిలో ప్రవేశ పెట్టనీయకుండా ఉదయం నుండి రూల్ 71 కింద తీర్మానం పైన చర్చించాలని పట్టు బడుతోంది. దీంతో..మండలిలో టీడీపీ సభ్యుల మెజార్టీ కారణంగా వైసీపీ నేతలు మండలి కొనసాగింపు పైన అసహనంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
సులువు కాదంటున్న టీడీపీ..
మండలిలో బిల్లులను ఆమోదించుకోలేకనే ప్రభుత్వం సభ్యులను బెదిరించే ధోరణిలో ఈ ప్రచారం తీసుకొచ్చిందంటూ టీడీపీ సభ్యులు కౌంటర్ ఇస్తున్నారు. మండలి రద్దు చేయటం అంత సులువైన అంశం కాదని..దీనికి పార్లమెంట్ ఆమోదం కావాలని..దాదాపు సంవత్సర కాలం సమయం పడుతుందని టీడీపీ సీనియర్ నేత యనమల వ్యాఖ్యానించారు.అదే సమయంలో మండలి రద్దు చేస్తామంటే తాము భయపడేది లేదని మాజీ మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. ఇక, మరో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సైతం దీని మీద స్పందించారు. మండలి రద్దు చేస్తే వైసీపీలో చీలక వస్తుందని జోస్యం చెప్పారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు ఆమోదించుకొనేందుకే..వ్యూహాత్మకంగా ఈ ప్రచారం తెర మీదకు తీసుకొచ్చిందని టీడీపీ నేతల వాదన. శాసన మండలిలో ఉదయం నుండి జరుగుతున్న పరిణామాలు..ఛైర్మన్ టీడీపీ ప్రతిపాదించిన తీర్మానం పైనచ చర్చకు అనుమతి ఇవ్వటం పైన వైసీపీ అసహనంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఆశావాహుల్లో టెన్షన్..
ఇక, 2019 ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వలేకపోయినా అనేక మందికి వైసీపీ అధినేత ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ సభ్యుల మెజార్టీ ఉన్నా.. వచ్చే ఏడాది నుండి ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీ కాలం ముగియటం మొదలు కానుంది. ఖాళీ అయిన స్థానాల్లో ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పాటుగా..అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో వైసీపీకి చెందిన వారే ఎమ్మెల్సీలు కానున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. అయితే, తన తండ్రి వైయ్సార్ 2004లో తిరిగి ప్రారంభించిన శాసన మండలిని జగన్ తాత్కాలిక సమ స్యల కారణంగా రద్దు చేయరని.. అది రాజకీయంగా వైసీపీకే నష్టం చేస్తుందనే వాదన సైతం వినిపిస్తోంది.