రఘురామ కృష్ణంరాజు జవాబిచ్చినా వారం తర్వాత వేటు తప్పదా ? వైసీపీ షోకాజ్ నోటీసుల ఆంతర్యం అదేనా ?
నరసాపురం వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో ఏం జరగబోతుంది ? షోకాజ్ నోటీసులు జారీ చేసిన వైసిపి అధిష్టానానికి రఘురామ కృష్ణంరాజు నేడు ధీటుగా సమాధానం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే తాను చెప్పదలచుకున్న విషయాన్ని మీడియా ముఖంగా చెప్పిన రఘురామకృష్ణంరాజు సమాధానానికి వైసిపి అధినాయకత్వం ఓకే అంటుందా ? వారం రోజుల తర్వాత చర్యలు తప్పవని పేర్కొన్న వేళ అసలు రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ఏం జరగబోతోంది అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ ఎంపీ ప్రాణాలకే రక్షణ లేదు.. ప్రభుత్వ దౌర్జన్యాలు కేంద్ర మంత్రే చెప్పారు : చంద్రబాబు ఫైర్
రఘురామ కృష్ణంరాజు సమాధానం ఇచ్చినా చర్యలు తప్పవా ?
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ నియమాలకు, అధినాయకత్వానికి వ్యతిరేకంగా మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలకు గాను క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వైసిపి హైకమాండ్ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో జరుగుతున్న లోటుపాట్ల పై మాత్రమే తాను మాట్లాడానని,తాను ఎన్నడూ పార్టీ అధ్యక్షుడిని, పార్టీని గానీ పల్లెత్తు మాట అనలేదని రఘురామ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. రఘురామ కృష్ణంరాజు ఎన్ని లాజిక్స్ మాట్లాడినా ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసిన వైసిపి వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని చెప్పింది. ఇక ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే క్రమంలోనే ఈ నోటీసులు జారీ చేసినట్లుగా పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులతో ఎంపీ వార్
రఘురామకృష్ణంరాజు మొదటి నుండి పార్టీలో వైయస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీపై తీవ్ర అసహనంతో ఉన్నారు. తనను అధినేత జగన్ ను కలవకుండా అడ్డుకుంటున్నారని మాట్లాడిన రఘురామకృష్ణంరాజు మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వ పథకాల అమలు సజావుగా జరగడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రఘురామ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు.జగన్ బొమ్మ లేకుండా రఘురామ కృష్ణంరాజు గెలిచే వాడే కాదని, గెలిచి చూపించమంటూ సవాల్ విసిరారు.జగన్ బొమ్మ లేకుండా మళ్లీ పోటీ చేసి తాను గెలుస్తానని, తన వల్ల గెలిచిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ప్రతి సవాల్ చేశారు రఘురామకృష్ణరాజు.
చిలికి చిలికి గాలివానై .. కేంద్రం దృష్టికి చేరిన పంచాయితీ
ఇలా రఘురామ కృష్ణంరాజు వర్సెస్ వైసీపీ నేతలు యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో రఘురామ కృష్ణంరాజుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సదరు నేతల నుండి డిమాండ్ వినిపిస్తుంది. ఇదే క్రమంలో తనకు ప్రాణహాని ఉందని, తనను చంపటానికి వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని లోక్సభ స్పీకర్ కుఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖపై స్పందించిన స్పీకర్ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కేంద్రం హోంశాఖను ఆదేశించింది.
లాజిక్ గా రఘురామ కృష్ణంరాజు సమాధానం చెప్పినా అధిష్టానం ఒప్పుకోదని చర్చ
ఈ వ్యవహారంపై మండిపడ్డ వైసిపి, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి ద్వారా షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే నేడు షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వనున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఆయన వాదనలో తాను పార్టీని కానీ, అధినేత జగన్మోహన్ రెడ్డిని కానీ కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని చెప్తున్నారు. అయితే రఘురామ కృష్ణంరాజు ఇచ్చే సమాధానంతో వైసిపి అధిష్టానం ఏకీభవించదు అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది.
వారం రోజుల తర్వాత సస్పెండ్ చేస్తారా ? బహిష్కరిస్తారా ?
వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో వారం తర్వాత ఆయనను సస్పెండ్ చేయడమో ,లేక పార్టీ నుంచి బహిష్కరించడమో చేస్తారని పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యల వ్యవహారం మాటలకే పరిమితం కాకుండా లోక్ సభ స్పీకర్ కు, కేంద్ర హోంమంత్రికి లేఖ రాయడంతో దుమారం గా మారింది. ఇక ఇదే ప్రస్తుతం ఆయనను మరింత ఇరకాటంలో పడేసిందని అంటున్నారు .
Recommended Video
వేటు వెయ్యటమే లక్ష్యంగా నోటీసులా ?
టిడిపి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలను ప్రస్తావించడం, బిజెపి కూడా రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించడం వంటి పరిణామాలు ఏపీలో అధికార వైసిపికి ఇబ్బందికరంగా మారాయి. ఈ సమయంలో అమిత్ షా ను కలవడానికి రఘురామకృష్ణంరాజు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో షోకాజ్ నోటీసు జారీ చేయడం, వారం రోజుల తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. ఈ దెబ్బతో రఘురామ కృష్ణం రాజు అవుట్ అని అంతర్గతంగా వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.