బీజేపీతో సీఎం జగన్ రివర్స్ గేమ్: ఏపీలో ఇలా..ఢిల్లీలో అలా : పవన్ కళ్యాణ్ కేంద్రంగా..!
సంబంధాలు కొనసాగాలి. రాజకీయంగా బలపడాలి. ఇదీ..అటు బీజేపీ..ఇటు వైసీపీ లక్ష్యం. అందులో భాగంగా..ఇప్పటి వరకు బీజేపీ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేసిన సీఎం జగన్..బీజేపీ తరహాలోనే రివర్స్ గేమ్ ప్రారంభించారు. బీజేపీ అధినాయకత్వం జగన్ తో సన్నిహితంగానే ఉంటూ..పరోక్షంగా పవన్ కు మద్దతిస్తుందనే అభిప్రాయం వైసీపీలో బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీకీ సాయం విషయంలో ఈ ఆరు నెలల కాలంలో ఏ రకంగా తోడ్పాటు అందించలేదు. ఇక, వైసీపీ ఎంపీ రఘురామ రాజు వ్యవహారం కేంద్రం బిందువుగా మారుతోంది.
జగన్ కామెంట్స్..ప్రగతి భవన్ లో వైబ్రేషన్స్..! సీఎంకు ఆ సమాచారం ఇచ్చిందెవరు: ఆ వ్యాఖ్యల వెనుక..!
దీంతో..ఢిల్లీలో కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే..ఏపీలో మాత్రం బీజేపీ బలపడే అవకాశం లేకుండా చూడటం ఇప్పుడు జగన్ లక్ష్యం. అందులో భాగంగా..బీజేపీ చేరటానికి సిద్దంగా ఉన్నవారిని తన వైపు తిప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు బీజేపీ నేతలకు రుచించటం లేదు. దీంతో..బీజేపీ ఏ రకంగా అయితే వైసీపీతో వ్యవహరిస్తుందో అదే తరహాలో బీజేపీతో రివర్స్ గేమ్ ఆడేందుకు జగన్ సిద్దమయ్యారు.
పవన్ కు బీజేపీ మద్దతిస్తుందా...
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కొంత కాలంగా సీఎం జగన్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా జగన్ కులం గురించి..మతం గురించి ప్రస్తావిస్తున్నారు. తిరుపతి వ్యవహారం పైనా ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షం కంటే తీవ్రంగా స్పందిస్తున్నారు. పదే పదే ఢిల్లీలో తనకున్న సంబంధాల గురించి ప్రస్తావిస్తున్నారు. అమిత్ షాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అమిత్ షా అంటే జగన్ కు భయమంటూ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం తానా సభల వేదికగా అమెరికాలో పవన్ కళ్యాన్ తో బీజేపీ కీలక నేత రాం మాధవ్ మంతనాలు సాగించటం..తాజాగా బీజేపీ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యల ద్వారా..ఇదంతా బీజేపీ డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారనే అనుమానం వైసీపీ నేతల్లో మొదలైంది. దీంతో.. ఇప్పటి వరకు బీజేపీ విషయంలో ఆచితూచి వ్యవహరించిన సీఎం జగన్ ఒక్కసారిగా తన స్టాండ్ మార్చుకున్నట్లు స్పష్టం అవుతోంది.
ఏపీలో ఇలా...ఢిల్లీలో అలా..
చంద్రబాబు నాయుడిని ఓడించి..భారీగా 151 సీట్లతో అధికారం దక్కించుకున్న జగన్ కు తొలిసారి మోదీని కలిసిన సమయంలో వైసీపీ నేతల కంటే ప్రధాని లో ఆనందం ఎక్కువగా కనిపించింది. ఏపీకి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ, ఆరు నెలల కాలంలో ఏపీకి చేసింది ఏమీ లేదు. ఇదే సమయంలో ఏపీలో రాజకీయంగా బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో వైసీపీకి చెందిన కొందరు ఎంపీలతోనూ టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో..జగన్ ఇక వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే కేంద్రంలో సత్సంబంధాలు కొనసాగిస్తూనే.. రాజకీయం గా మాత్రం ఏ అవకాశం బీజేపీ కోసం వదులుకోకూడదని నిర్ణయించారు. అందులో భాగంగా..కేంద్రం ప్రతిపాదించిన ప్రతీ బిల్లుకు వైసీపీ మద్దతిస్తోంది. తాజాగా సిటిజన్ షిప్ బిల్లుకు మద్దతిచ్చింది. ఇదే సమయంలో బీజేపీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవటం ప్రారంభించింది. బీజేపీ తమతో ఏ విధంగా వ్యవహరిస్తుందో తాము అదే రకంగా వ్యవహరించాలని జగన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
బీజేపీ నేతలకు వైసీపీ ట్రాప్
లోక్ సభలో ఇప్పుడు ఇతర పార్టీల ఎంపీల అవసరం బీజేపీకి లేదు. అదే విధంగా ఏపీ అసెంబ్లీలో బీజేపీకి ఎమ్మెల్యేలు లేరు. అయినా..వైసీపీ ఎంపీలు ముగ్గురితో బీజేపీ టచ్ లో ఉందనే ప్రచారం సాగుతోంది. వారు పార్టీ మారే అవకాశం లేకపోయినా..సీఎం ఈ పరిణామాల పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే..బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న రఘురామరాజుకు చెక్ పెట్టేందుకు నర్సాపురం లోని బీజేపీ కి కీలకంగా ఉన్న గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులను వ్యూహాత్మకంగా వైసీపీలోకి తీసుకొచ్చారు. గతంలో బీజేపీ నేతల అభ్యర్ధన మేరకు కన్నా లాంటి వారిని పార్టీలో చేర్చుకోకుండా వేచి చూసారు. కానీ, ఇప్పుడు తొలుత బీజేపీలోకి టచ్ లోకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..బీదా మస్తాన్ రావు లాంటి వారిని సైతం అటు వెళ్లకుండా వైసీపీ నేతలు తమ పార్టీ వైపు మళ్లించారు. దీని ద్వారా..ఇప్పుడు బీజేపీ.. వైసీపీ రెండు పార్టీలు పైకి సన్నిహతంగా కనిపిస్తున్నా..ఎవరికి వారు ఎత్తులు..పై ఎత్తులతో బీజీగా ఉన్నారు. దీంతో..రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.