ఆ బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే ప్లాన్ లో వైసీపీ .. రివర్స్ స్కెచ్ వేస్తున్న టీడీపీ
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ వెయ్యాలని మండలి చైర్మన్ షరీఫ్ తో పాటు టీడీపీ ,అయితే మండలిని రద్దు చేసి తీరాలని వైసీపీ హోరాహోరీగా పోరాడుతున్న విషయం తెలిసిందే . ఇక తాజాగా అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ సర్కార్. మండలిని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తెస్తే రాజధానుల ఏర్పాటు సులభం అవుతుందని భావిస్తుంది కానీ అది అంత ఈజీ కాదని తెలుస్తుంది. ఇక టీడీపీ సైతం సర్కార్ వేస్తున్న అడుగులను బట్టి ప్రతి వ్యూహం సిద్ధం చేసుకునే పనిలో ఉంది.
మండలి కార్యదర్శిపై చైర్మన్ సీరియస్ ..సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు హుకుం..ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ !!
సెలెక్ట్ కమిటీ ఫైల్... నేడు సాయంత్రం వరకే మండలి కార్యదర్శికి చైర్మన్ గడువు
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం వివిధ పార్టీల నుంచి సభ్యుల పేర్లను మండలి కార్యాలయానికి పంపి కమిటీ ఏర్పాటు చెయ్యాలని ఛైర్మన్ షరీఫ్ పంపించిన ఫైల్ ను తిరస్కరించి రూల్ 154 కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఫైల్ మీద రాసి మండలి కార్యాలయ కార్యదర్శి తిప్పి పంపటంపై చైర్మన్ షరీఫ్ సీరియస్ అయిన విషయం తెలిసిందే . ఇక సెలక్ట్ కమిటీ ఏర్పాటు ఫైల్ వెనక్కి పంపండంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని ఆదేశాలు జారీ చేశారు. మండలి కార్యదర్శికి చైర్మన్ ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇక నేడు అసలు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతుంది.
అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ కు అవకాశం .. తర్జన భర్జనలో అధికారులు
మండలిలో సెలెక్ట్ కమిటీ వివాదం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆలోపే అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకోసం న్యాయ నిపుణులతో , ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చలు జరుపుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ప్రోరోగ్ వల్ల ప్రభుత్వానికి ఆర్డినెన్స్ తెచ్చుకొనే అవకాశం ఏర్పడుతుందని అనుకుంటున్నారు . అయితే ఆర్డినెన్స్ తెచ్చినా మళ్లీ అసెంబ్లీ, మండలికి పంపాల్సిందేనని అధికారులు అంటున్నారు . అంతేకాదు కోర్టులో కేసు ఉండటంతో ఈనెల 26 వరకు రాజధానుల తరలింపు సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఆర్డినెన్స్ తెస్తే కోర్టుకు , గవర్నర్ వద్దకు వెళ్ళాలని టీడీపీ నిర్ణయం
ఇక ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వస్తే టీడీపీ మరో అస్త్రాన్ని సంధించాలని భావిస్తుంది . ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే కోర్టును ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయించింది. రూల్ నెంబర్ 154 కింద సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు చైర్మన్ ప్రకటించిన నేపధ్యంలో , చైర్మన్ విచక్షణాధికారాల మేరకే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న తరుణంలో ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం లేదని టీడీపీ పేర్కొంటుంది . ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ను కలవాలని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.
పంతం నీదా.. నాదా అన్నట్టు మండలి విషయంలో వైసీపీ ,టీడీపీలు
ఎలాగైనా సరే మండలి రద్దు చేసి , మూడు రాజధానులను ఏర్పాటు చేసి పంతం నెగ్గించుకోవాలని వైసీపీ భావిస్తుంటే వైసీపీ ఎత్తుగడలకు చెక్ పెట్టి మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకోవాలని టీడీపీ విఫల యత్నాలు చేస్తుంది . ఏది ఏమైనా శాసన మండలి రద్దు రగడ నేడు మరో కీలక మలుపు తిరగబోతుంది అనేది మాత్రం తాజా పరిణామాలతో సుస్పష్టం .