వైసీపీ రాజకీయ ఉగ్రవాదుల పార్టీ ! ఏపి సీఎం జగన్ చిన్న నాటి స్నేహితుడి ఘాటు వ్యాఖ్యలు !!
అమరావతి/హైదరాబాద్ : ఆరోపణలు-ప్రత్యారోపణలు, ఎత్తులు- పైఎత్తులతో ఏపి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అంతే కాకుండా అదికార పార్టీపై విమర్శలకు పదునుపెడుతున్నారు విపక్షనేతలు. జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి... జగన్ మంచి మిత్రులు. ఒకట్రెండేళ్లు వారు క్లాస్ మేట్స్ అని కూడా చెబుతుంటారు. అలాంటి ఫ్రెండే జగన్ ను ఏకిపడేశారు. "వైసీపీ నేతలు రాజకీయ ఉగ్రవాదులుగా మారి గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని" ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం పార్లమెంట్ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన పవన్ రెడ్డి టీడీపీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ పాలనను ఆయన తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవగాహనా రాహిత్యంతో రాష్ట్రం అధోగతి పాలవుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే వైఎస్ జగన్ పాలనపై ప్రజలు ఛీ కొడుతున్నారని ఆయన అన్నారు.
ప్రజా సంక్షేమాన్ని మరిచి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజా శ్రేయస్సును వదిలేసి ముఖ్యమంత్రి సంఘ విద్రోహశక్తిగా తయారయ్యారని విమర్శించారు. లోప రహితమైన ఆధునిక ప్రభుత్వ కట్టడాన్ని కూల్చేసిన ఘనత వైఎస్ జగన్ దే అని, ఆయన పిచ్చి తుగ్లక్ పాలనను చూసిన ప్రపంచ సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు దూరంగా పారిపోతున్నాయని అన్నారు. వైఎస్ జగన్ అవినీతి రహిత పాలన అందించడం తర్వాత సంగతి... ముందు పాలన సక్రమంగా సాగించే పరిస్థితి కూడా కనిపించడం లేదన్నారు.
పింఛనుపెంచడంలో, అమ్మఒడి పథకంలో, 45 ఏళ్ల పింఛనులో, రైతులకు సాయంలో, స్టోరు బియ్యంలో మోసం జరుగుతోందిని విమర్శించారు. ఇలా ప్రతి విషయంలో మోసం చేసి నవరత్నాలను జగన్ రంగురాళ్లుగా మారుస్తారని పవన్ వ్యాఖ్యానించారు. కరువు ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు 969 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే జగన్ ఈ బడ్జెట్లో 36 కోట్ల రూపాయలు కేటాయించడం జగన్ అవగాహనా రాహిత్యానికి, అనుభవ రాహిత్యానికి నిదర్శనమన్నారు.