వైసీపీ ఓ రౌడీ పార్టీ ... ఏపీలో జగన్ టార్గెట్ గా రంగంలోకి కాంగ్రెస్
ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు . ఇప్పటికే బీజేపీ, జనసేన , టీడీపీలు వైసీపీపై మాటల దాడిని కొనసాగిస్తుంటే, కొత్తగా కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఇటీవల ఏపీసీసీ బాధ్యులుగా బాధ్యత చేపట్టిన నాయకులు వైసీపీ సర్కార్ పై, అలాగే జగన్ మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాలకపక్షంగా మారిన వైసీపీ ఓ వీధి రౌడీ పార్టీ అన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి.
వారం క్రితం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన తులసీరెడ్డి బుధవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడిన తులసీరెడ్డి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభత్వాలపై నిప్పులు చెరిగారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టి భరతమాత బానిస సంకెళ్లను తెంచిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు తులసీరెడ్డి . కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ దుష్ట పాలనకు చరమగీతం పడాలని తులసీరెడ్డి పిలుపునిచ్చారు.బీజేపీ అంటే బరితెగించిన పార్టీ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు . ప్రత్యేక హోదా విభజన హామీలకు బీజేపీ మంగళం పాడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .
ఇక ఏపీలో కాంగ్రెస్ కూడా ప్రజా క్షేత్రంలో ఉంటుందంటూ సంకేతంగా రాష్ట్ర , కేంద్ర రాజకీయ పార్టీలను టార్గెట్ చేసి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రౌడీ పార్టీ అని అభివర్ణించారు. టీడీపీ అంటే తినడం, దోచుకోవడం, పంచుకోవడం అన్న చందంగా ఉందన్న ఏపీసీసీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంటింటా సౌభాగ్యం వెల్లివిరియాలి అంటే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ లు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ కాపాడుతుందని భరోసా ఇచ్చారు తులసీరెడ్డి .