వైసీపీలో సీరియస్ నెస్ లేదు, ఏదో మొక్కుబడిలా కనిపిస్తోంది: మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉన్నట్టు ఎంతమాత్రమూ కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అవిశ్వాసం విషయంలో ఆ పార్టీది మొక్కుబడిగా కనిపిస్తోందని శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పన విషయంలో మొదటి నుంచి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, తాము అధికారంలోకి వస్తే.. తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టంగా చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.
అన్ని ప్రతిపక్ష పార్టీలనూ సమన్వయం చేసుకునే ఉద్దేశం వైసీపీకి ఉన్నట్లు లేదని, తాము యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించి, ఈ అవిశ్వాస తీర్మానంపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఖర్గే పేర్కొన్నారు.
మరోవైపు శుక్రవారం ఉదయం చంద్రబాబునాయుడు ఆదేశించినట్టుగానే 16 మంది తెలుగుదేశం సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం లోక్సభ కార్యదర్శికి కొద్దిసేపటి క్రితమే అందించారు. నోటీసులను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
అనంతరం తోట నరసింహం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్పై, తెలుగుదేశం పార్టీపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అవిశ్వాస తీర్మానంపై ఇతర పార్టీల మద్దతు కోసం చర్చిస్తున్నారని కూడా ఆయన చెప్పారు.