జగన్ పీఏ పేరిట బెదిరింపులు: డబ్బివ్వకుంటే నీ కూతుర్ని బాయిలర్లో వేచి చంపేస్తాం..!!
ముఖ్యమంత్రి జగన్ ఏపీ పేరు చెప్పి పార్టీ ఐటీ విభాగంలో పని చేసే వ్యక్తి బెదిరింపులకు దిగాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుంటే నీ కూతుర్నీ బాయిలర్లో వేస్తాం అంటూ హెచ్చరించాడు. తక్షణం డబ్బులు ఇవ్వాలని.. లేదం టే గుంటూరులోని వైసీపీ నేత కార్యాలయానికి రావాలని హుకుం జారీ చేసాడు. దీంతో.. బాధితుడు భార్య..కుమార్తెతో కలిసి గుంటూరు ఎస్పీని కలిసారు. జరిగిన ఘటన పైన పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసారు. ముఖ్యమంత్రి పీఏ పేరు చెప్పి ఐటీ విభాగానికి చెందిన వ్యక్తం చేసిన హల్చల్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
Recommended Video
సీఎం పీఏ పర్సనల్ మేటర్ ఇది..
వైసీపీ ఐటీ విభాగంలో పని చేస్తునన మహేంద్ర రెడ్డిపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఏకంగా ముఖ్యమంత్రి పీఏ పేరు చెప్పి మహేంద్ర రెడ్డి బెదిరింపులకు దిగాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే విజయవాడలో వైష్ణవి ని బాయిలర్లో దహనం చేసినట్లుగానే..నీ కూతుర్ని అలాగే చంపేస్తామంటూ హెచ్చరించాడు. ప్రకాశం జిల్లాకు చెంది న వెంకటేశ్వర్లు గుంటూరు మండలం లాల్పురంలో కొంతకాలంగా ఉంటున్నారు. వైసీపీ కార్యాలయం ఐటీ విభాగంలో పనిచేస్తున్న కే మహేంద్రరెడ్డి నుంచి ఆ వ్యాపారం కోసం గతంలో రూ. 15 లక్షలు రూ. 4 వడ్డీకి అప్పుగా తీసుకున్నారు. నెలకు రూ. 60వేలు వడ్డీ చొప్పున చెల్లిస్తూ వచ్చారు. అసలు, వడ్డీ కలిపి రూ. 15 లక్షలకు గాను రూ. 28 లక్షల వరకు చెల్లించారు. అప్పు తీసుకున్న సమయంలో మూడు చెక్కులు, 19 ప్రామిసరి నోట్లు మహేంద్రరెడ్డి రాయించుకొన్నారు. ఇక ఇచ్చుకోలేనని వెంకటేశ్వర్లు చెప్పడంతో రెండు చెక్కులను రూ. 5 లక్షలకు వేరేవారి పేరుతో కోర్టులో వేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో వెంకటేశ్వర్లు ప్రస్తుతం కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆయన మీద దాడి కూడా చేసారని బాధితుడు చెబుతున్నాడు.
సీఎం గన్మెన్ అంటూ ఫోన్..
కొద్దిరోజుల క్రితం వెంకటేశ్వర్లుకు ఓ వ్యక్తికి ఫోన్ చేసి, సీఏం గన్మెన్గా పరిచయం చేసుకొన్నాడు. మహేంద్రరెడ్డికి ఇవ్వాల్సిన డబ్బు మొత్తం వడ్డీతో చెల్లించాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. దీనికి కొనసాగింపుగా వైసీపీ నేత సుంకర రామాజంనేయులు ఫోన్ చేసి ఇది జగన్ పీఏ పర్సనల్ వ్యవహారమని..తక్షణం డబ్బు చెల్లించాలని లేకుంటే గుంటూరులోని వైసీపీ నేత కార్యాలయానికి రావాలని బెదిరించాడు. అదే వ్యక్తి డబ్బు ఇవ్వకపోతే నీ కూతుర్ని కిడ్నాప్ చేసి బాయిలర్లో వేస్తామని హెచ్చరించాడు. దీంతో..బాధితుడు గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసాడు. ముఖ్యమంత్రి పీఏ పేరు చెప్పి బెదిరిస్తున్నారని వివరించాడు. ఇదే సమయంలో మహేంద్ర రెడ్డి తనను బెదిరిస్తున్నాడంటూ మరో బాధితుడు నర్సిరెడ్డి గుంటూరు ఎస్పీని కలుసుకొన్నారు. గ్రామంలో తనకు ఉన్న ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలను మహేంద్రరెడ్డి మనుషులే దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నారని తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీని పైన ఎస్పీ సీరియస్గా స్పందించారు. వెంటనే విచారణ చేయాలని ఆదేశించారు.
హద్దు మీరుతున్నారు..చర్యలు తప్పవు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కింది స్థాయిలో ఉండే కొందరు ముఖ్యమంత్రి పీఏ పేరు చెప్పి హెచ్చరికలు చేయటం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వానికే డామేజ్ గా మారుతోంది. తాజాగా కడప జిల్లాలో జరిగిన ఘటనలు.. ఇప్పుడు గుంటూరులో వెలుగులోకి వచ్చిన విషయాల పైన కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోకపోతే ఇక పార్టీలోని కింది స్థాయిలో కొందరు చేస్తున్న ఇటువంటి వ్యవహారాలు పార్టీకి నష్టం చేస్తాయనే అందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం మీద రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు సైతం పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో విశాఖలో సైతం జగన్ పిఏ అంటూ కొందరు పార్టీ నేతలకు ఫోన్లు చేసి డబ్బులు తీసుకున్న విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం పైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.