రోజా పదవికి అడ్డు ఎక్కడ : ఆయన మాటకు జగన్ లొంగారా: ఫైర్ బ్రాండ్ ఇప్పుడెక్కడ..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఇప్పుడెక్కడ. నిన్నటి వరకు తనకు మంత్రి పదవి ఖాయమని ధీమా వ్యక్తం చేసిన రోజా.. జగన్ సచివాలయ ప్రవేశ సమయంలో..మంత్రివర్గ విస్తరణ వేదిక వద్దకు రాలేదు. మంత్రిగా అవకాశం దక్కకపోవటంతో రోజా అసంతృప్తితో ఉన్నారా. అసలు రోజాకు మంత్రి పదవికి రాకపోవటానికి కారణం ఏంటి. జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత రోజాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారా. ఆయన మాటకు జగన్ లొంగారా. విధేయతకు పట్టం కట్టిన జగన్..రోజా విషయంలో మాత్రం ఎందుకిలా..ఇప్పుడు ఇదే అంశం వైసీపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రోజాకు దక్కని మంత్రి పదవి..
వైసీపీ ఫైర్బ్రాండ్ రోజాకు మంత్రి పదవి దక్కలేదు. తొలి నుండి రోజాకు పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. వైసీపీ అధికారంలోకి వస్తే రోజా హోం మంత్రి అవుతారని జోరాగా ప్రచారం సాగింది. ఆ తరువాత రోజాకు స్పీకర్ అని కొందరు .. డిప్యూటీ స్పీకర్ అని మరి కొందరు చెప్పుకొచ్చారు. ఇక, మంత్రి వర్గ విస్తరణకు ముందు జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొనటానికి వచ్చిన రోజా సైతం తాను మంత్రి పదవి కోరలేదని..అయినా జగన్ తన విధేయతను గుర్తిస్తారని..తనకు మంత్రిగా అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేసారు. అయినా..తుది కూర్పులో మాత్రం రోజాకు మంత్రి గా అవకాశం దక్కలేదు. చిత్తూరు జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఎస్సీ కేటగిరీలో నారాయణ స్వామికి అవకాశం దక్కింది. పెద్దిరెడ్డి సీనియర్ కావటంతో..ఆయనకు కేబినెట్లో స్థానం ఖాయంగా ఉంటుంది. అయితే, అదే సామాజిక వర్గంకు చెందిన రోజాకు ఈ కారణంగానే పదవి దక్కలేదని తెలుస్తోంది.
ఆయన అడ్డుపడ్డారా..జగన్ లొంగారా
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు వైసీపీలో ముఖ్య నేత. ఒక రకంగా తొలి నుండి వైసీపీకి ఆర్దికంగా అండగా ఉంటూ వస్తున్నారు. తాఆ ఎన్నికల సమయంలోనూ ఆర్దిక తోడ్పాటు పార్టీకి అందించారు. ఆయనకు మంత్రి పదవి ఖాయం చేసారు. అయితే, ఆయన నేరుగా కాకుండా పరోక్షంగా తన సామాజిక వర్గానికి చెందిన వారికి జిల్లాలో మరకొరు కాకుండా..ఎస్సీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని జగన్ పైన ఒత్తిడి తెచ్చారు. రోజాకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన జగన్కు ఉన్నా..చిత్తూరు జిల్లాలో ఒక ఎస్సీకి కేబినెట్లో స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడికి సైతం లోక్సభలో వైసీపీ పక్ష నేతగా ఖరారు చేసారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక పోర్టుఫోలియో కేటాయిస్తున్నారు. ఈ కారణాలతోనే సామాజిక సమతుల్యత పేరుతో రోజాకు మంత్రి పదవి ప్రస్తుతానికి ఇవ్వలేదని పార్టీలో చర్చ సాగుతోంది.
ఫైర్ బ్రాండ్ ఇప్పుడెక్కడ..!
వైసీపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన రోజాకు సాయంత్రం ప్రకటించిన కేబినెట్ లిస్టులో పేరు లేకపోవటంతో మనస్థాపానికి గురయ్యారు. అయితే, సీఎం జగన్ మాత్రం రోజాను విజయవాడలోనే అందుబాటులో ఉండమన్నారని ప్రచారం సాగింది. అయితే, జగన్ సచివాలయ ప్రవేశ కార్యక్రమానికి హాజరు కాలేదు. అదే విధంగా మంత్రుల ప్రమాణ స్వీకార వేదిక వద్దకు ఇప్పటికే పార్టీ నేతలు అందరూ చేరుకున్నారు. కానీ, రోజా మంత్రి కనిపించ లేదు. దీంతో.. అసలు రోజా ఎక్కడ ఉన్నారని ఆరా తీయగా.. హైదరాబాద్ వెళ్లిపోయినట్లు సమాచారం అందుతోంది. మరి..జగన్ తన సోదరిగా చెప్పుకొనే రోజాకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి.