లోకేష్ కు ఆ మహిళా మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ .. ఉనికి కోల్పోతామని దాడులు చేస్తుంది టీడీపీనే
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ టిడిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ రాజన్న రాజ్యం ఇదేనా అంటూ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టుకు నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని పేర్కొన్న సుచరిత లోకేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ కార్యకర్తలపై దాడుల నేపధ్యంలో మా సహనం పరీక్షించొద్దు అని లోకేష్ ట్వీట్
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల పై వైసిపి రౌడీలు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దు అంటూ ట్వీట్ చేసారు మాజీ మంత్రి నారా లోకేష్. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని రైతులను అయిదేళ్లు గ్రామ బహిష్కరణ చేశారని, వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదలు గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వందకు పైగా దాడులు చేశారని , ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.
లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి సుచరిత కౌంటర్ .. దాడుల్లో ఎక్కువగా గాయపడింది వైసీపీ నేతలే
ఇక లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ గా సుచరిత వైసిపి కార్యకర్తలు పై టీడీపీ నేతలే దాడులకు పాల్పడుతున్నారని , పైగా నిందను వైసీపీ నాయకుల మీద నెడుతున్నారని ఆమె లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇక లోకేష్ ట్విట్టర్ వేదికగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నాడని మేకతోటి సుచరిత ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన దాడుల్లో 44 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడితే వైసిపి నేతలు 57 మంది గాయపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. అసలు దాడులు చేస్తుంది టీడీపీ నేతలే అని ఆమె ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి ఆదేశానుసారం కట్టుదిట్టమైన భద్రత ను ఉంచినా టిడిపి నేతలు మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆమె తప్పు పట్టారు.
టీడీపీ నేతలు ఉనికి కోల్పోతున్నామన్న భయంతోనే దాడులు చేస్తున్నారన్న హోం మంత్రి సుచరిత
వివిధ ప్రాంతాల్లో టీడీపీ నేతలు ఉనికి కోల్పోతున్నామన్న భయంతో వై.సీ.పి నేతలపై దాడులకు దిగుతున్నారని ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో వైసీపీ నేతలే అధికంగా గాయపడ్డారని హోంమంత్రి చెప్పుకొచ్చారు. గతంలో మహిళా అధికారులను కొట్టినా పట్టించుకున్న నాథుడు లేడని, అంతేకాదు అన్యాయాన్ని నిలదీసిన ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ రాకుండా అడ్డుకున్నారని ఆమె విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత, నైతికత టిడిపికి లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత తేల్చి చెప్పారు.