చంద్రబాబుకు పతనానికి ఇంక 4 నెలలే...డిజిపి చెంపలేసుకొని రాజీనామా చేయాలి:జోగి రమేష్
విజయవాడ:జగన్ పై దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిజిపి ఆర్పి ఠాకూర్ పై వైసిపి నేత జోగి రమేష్ విమర్శల వర్షం కురిపించారు.
వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం డ్రామా అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టుకు సమాధానం చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్పై జరిగింది ముమ్మాటికే హత్యాయత్నమేనని పోలీసుల రిమాండ్ రిపోర్టు వెల్లడించిందని జోగ్ రమేష్ తెలిపారు. విజయవాడలోని వైసిపి కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతి విషయంలో అసత్య ప్రచారాలు, అబద్దాలతో రెచ్చిపోతున్న ఎపి సిఎం చంద్రబాబు పతనానికి ఇంకో నాలుగు నెలలు మాత్రమే గడువు ఉందని వైసిపి నేత జోగి రమేష్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి 'ఆపరేషన్ గరుడ'ని సృష్టించింది చంద్రబాబేనని జోగి రమేష్ ఆరోపించారు. నటుడు శివాజీని పావుగా వాడుకుని చంద్రబాబు ఈ నాటకాలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
మరోవైపు సిఎం చంద్రబాబుకు వంత పాడుతూ....తప్పుడు ప్రకటన చేసిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెంపలేసుకోవాలనీ, ఉద్యోగానికి రాజీనామా చేయాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. డీజీపీతో సహా అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నాయకులు రిమాండ్ రిపోర్ట్ చూసి సిగ్గుతో తలదించుకోవాలని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్పై దాడి చేసింది ఆయన అభిమానే నంటూ విష ప్రచారాలతో ఊదరగొడుతున్న మతి లేని ముఖ్యమంత్రి ఇప్పటికైనా అసలు వాస్తవాలు తెలుసుకోవాలని జోగి రమేష్ హితవు పలికారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తేనని ఆయన పునరుద్ఘాటించారు. శ్రీనివాసరావు పేరుతో ఉన్న తెలుగుదేశం పార్టీ పార్టీ ఐడెంటిటీ కార్డును మీడియాకు చూపించారు.