ముమ్మాటికీ ఇది రాజకీయ హత్యే ..కొల్లు రవీంద్రపై మోకా భాస్కర్ రావు భార్య ఏమన్నారంటే..
ఏపీలో ఇప్పుడు మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు హత్య కేసుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్యలో కీలక మలుపు చోటు చేసుకుంది. అయితే ఈ హత్యపై మోకా భాస్కరరావు భార్య వెంకటేశ్వరమ్మ స్పందించారు.
తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని తాము ఊహించలేదని ఆమె పేర్కొన్నారు. మోకా భాస్కరరావు హత్య తర్వాత తాము కూడా టిడిపి నేతలపై అనుమానం వ్యక్తం చేశామని, తాము అనుమానించినట్లే పోలీసుల విచారణలో నిందితులు టిడిపి నేతల పేర్లు చెప్పారని ఆమె పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర స్వయంగా తన అనుచరులతో ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారని, తన భర్త కు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకనే, అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించారని వెంకటేశ్వర పేర్కొన్నారు.
మచిలీపట్నం నియోజక వర్గంలో కొల్లు రవీంద్ర చేసే అక్రమాలను తన భర్త ప్రశ్నించే వాడిని, గూటాల చెరువు భూముల అమ్మకం పై తన భర్త పోరాటం చేశారని వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. ప్రజల పక్షాన తన భర్త పోరాటం చేశాడని ఓర్వలేక చంపేశారని వాపోయారు.తన భర్త హత్య కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఏ తప్పు చెయ్యకుంటే, ఆయన పాత్ర లేకుంటే కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారని వెంకటేశ్వరమ్మ ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఒక మనిషిని చంపేంత దారుణాలకు ఒడిగడతారని ఊహించలేదని మృతుడు మోకా భాస్కరరావు భార్య వెంకటేశ్వరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.