మూడురోజుల పోలీస్ కస్టడీకి వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసు నిందితులు
వైసీపీ నాయకుడు, మంత్రి పేర్ని నానికి ప్రధాన అనుచరుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణలో వేగం పెంచారు .ఇప్పటికే ఈ కేసులో ఒక మైనర్ తో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు, నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ హత్యకు టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుట్ర చేసినట్టుగా నిర్ధారణకు వచ్చి ఆయనను అరెస్టు చేశారు.
ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వీరిలో ప్రధాన నిందితులుగా ఏ1, ఏ 2 గా ఉన్ననిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు హత్యకు పాల్పడిన ఏ 1, ఏ 2 నిందితులైన చింత నాంచారయ్య అలియాస్ చిన్న, చింత నాంచారయ్య అలియాస్ పులి లను కస్టడీలోకి తీసుకోనున్నారు.
మోకా భాస్కర్ రావు హత్య కేసులో ప్రధాన నిందితులైన వారిని మూడు రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు .అందుకు న్యాయస్థానం అనుమతించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న చింత చిన్న, చింత పులిలను మచిలీపట్నం తీసుకురావడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మోకా భాస్కరరావు హత్యకేసులో వీరిద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మోకా భాస్కరరావు హత్యకు ఎప్పుడు ప్లాన్ చేశారు? ఎన్నిసార్లు భేటీ అయ్యారు? ఈ కేసులో కొల్లు రవీంద్ర పాత్ర ఏంటి? తదితర అంశాలపై ఈ మూడు రోజుల విచారణ కొనసాగనుంది.