బాబూ లోకేశూ.. ఓసారి ఆ ఇంటర్వ్యూలకు వెళ్లి రా.. విజయసాయి సెటైర్లు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. అధికారపక్షమైన వైసీపీ, ప్రతిపక్షమైన టీడీపీ మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీని ఇరుకున పెట్టేవిధంగా టీడీపీ నేతలు ప్రయత్నిస్తుంటే.. గతాన్ని తవ్వుతూ సైకిల్ లీడర్లకు చురకలు అంటిస్తున్నారు ఫ్యాన్ నేతలు.
తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్పై ఆరోపణాస్త్రాలు గుప్పించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ పక్ష నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.
సైకిల్ వర్సెస్ ఫ్యాన్
టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం పీక్ స్టేజీకి చేరింది. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయంటూ పరోక్ష యుద్దానికి తెరలేపారు వైసీపీ నేతలు. ఆ క్రమంలో జగన్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు సైతం ప్రత్యారోపణలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా నారా లోకేశ్పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
ట్విట్టర్ వేదికగా ఆదివారం నాడు తండ్రీకొడుకులిద్దరికీ చురకలు అంటించారు విజయసాయి రెడ్డి. మొదట దోచుకోవడం.. తర్వాత దాచుకోవడం మీకు అలవాటేనని.. అలా దాన్ని వ్యవస్థీకృతం చేసిన ఘనత కూడా మీదేనని మండిపడ్డారు.
బీసీ మంత్రం జపిస్తున్న జగన్ ప్రభుత్వం.. సంక్షేమానికి పెద్దపీట..!
40 ఇయర్స్ ఇండస్ట్రీ కాదు.. ఏం చేశారు మీరు?
రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి ఉన్నామంటూ పదేపదే చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం.. అదేదో ప్రత్యేక అర్హత అన్నట్లు ఫోజులివ్వడం సరికాదన్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఘనంగా చెప్పుకునే తమరు ప్రజల కోసం చేసిందేమీ లేదని ఫైరయ్యారు. నలభై ఏళ్లల్లో రాష్ట్రాని రాబందుల్లా పీక్కు తిని కుటుంబ ఆస్తులను లక్షల రెట్లు పెంచుకున్నారని ధ్వజమెత్తారు.
మీ అవినీతి చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని.. భావితరాలకు అలాగే గుర్తుండిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఈసారి తిరిగి అధికారం ఎందుకు కట్టబెట్టలేదోనని ప్రతిరోజు మీ నాన్న, మీరు ఆడే డ్రామాలు ఇక చాలించాలని చురకలంటించారు. రానున్న మూడు సంవత్సరాలలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి తీరుతామని సీఎం జగన్ చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా మీ రికార్డు పదిలంగా ఉంటుందని.. ఆ విషయంలో మీరేమీ టెన్షన్ పడనక్కర్లేదన్నారు.
వంక పెట్టడం కాదు.. అభివృద్ధి మీరే చూస్తారుగా..!
ప్రతి పనికి ఏదో వంక పెట్టే రీతిగా టీడీపీ నేతలు వ్యవహరించడం సరికాదన్నారు విజయసాయి రెడ్డి. గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేయడం మానుకోవాలని.. ఓసారి ఆ ఇంటర్వ్యూలకు వెళ్లి రావాలని లోకేశ్కు సూచించారు. అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు దొబ్బేసిన చంద్రబాబుకు.. తమ ప్రభుత్వం బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే అది ఆయనకు చాలా చిన్నదిగా అనిపించడం సహజమే కదా అని ఎద్దేవా చేశారు.
లక్ష కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం అంటూ మాయాబజారును కళ్లకు కట్టారని ఆరోపించారు. ఆ పేరుతో లెక్కలేనన్ని ఫారిన్ ట్రిప్పులు కొట్టారని ఫైరయ్యారు. విదేశీ బృందాలతో గ్రాఫిక్స్ ప్రదర్శనలు తప్ప చేసిందేమిటని ప్రశ్నించారు. మీ పాలనకు, జగన్ పాలనకు కచ్చితంగా తేడా ఉంటుందని.. తమ ప్రభుత్వంలో ప్రతి పనికి రోజువారీ పురోగతి ఉంటుందని చెప్పుకొచ్చారు. చూస్తారుగా అప్పుడే తొందరెందుకంటూ ముగించారు.