కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీ కాంతంపై...వైసీపీ నేతల అభినందనల జల్లు
విజయవాడ: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నారంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీ కాంతంను వైసీపీ నేతలు అభినందించారు.
ప్రభుత్వ పథకాల అమల్లో పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపికచేసి, పారదర్శకమైన సేవ లను అందించడంలో జిల్లాను మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలిపారని కలెక్టర్ బి.లక్ష్మీ కాంతంపై వైసీపీ నేతలు కె.పార్థసారథి, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు ప్రశంసల వర్షం కురిపించారు. జిల్లా పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం ప్రతిపక్ష వైసిపి నేతలు కలెక్టర్ బి.లక్ష్మీ కాంతంను క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
కలెక్టర్ ను కలసి వినతి పత్రం సమర్పించేందుకు వచ్చిన సందర్భంగా వైసిపి నేతలు మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించడంలో కలెక్టర్ అందరి అభిమానాన్ని చూరగొనడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. కలెక్టర్ జిల్లాలోని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, సుపరిపాలన అందిస్తున్నతీరును ప్రతిపక్ష పార్టీ నేతలు మెచ్చుకున్నారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.