ఎన్నికల్లో గెలవలేక ఇప్పుడు రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు .. సొంత పార్టీ నేతల్లోనూ అసహనం
ఎక్కడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ గెలవకుండా రచ్చ చేస్తున్నారు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు . ఫ్యాను గాలి జోరుగా ఉన్న సమయంలో కూడా గెలవలేక ప్రత్యర్ధుల చేతిలో పరాజయం పాలైన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మీడియా మైకుల ముందుకొచ్చి తామే ఎమ్మెల్యే అంటూ ఫోకస్ అవుతున్నారు. వైసీపీ ఇంత అఖండ మెజార్టీతో గెలిచినా గెలవలేకపోయారు ఇప్పుడు కొండను తవ్వి ఎలుకను పట్టుకుంటామని చెప్తున్నారు .
ఓటమి పాలైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల హల్చల్.. టీడీపీ ఎమ్మెల్యేల మీద కోర్టుల్లో కేసులు
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వీచింది . అయితే మొత్తం 175 నియోజకవర్గాల్లో 151 సీట్లు వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. కేవలం 23 స్థానాలు మాత్రమే టీడీపీకి దక్కాయి. ఇక ఒక స్థానం జనసేన ఖాతాలో పడింది. టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా కొన్ని స్థానాల్లో ఇప్పుడు వైసీపీ నేతలు హల్ చల్ చెయ్యటం సొంత పార్టీలోనూ, స్థానికంగానూ చర్చకు కారణం అవుతుంది. వైసీపీ కి మంచి ఊపున్న సమయంలో గెలవలేని వారు ఇప్పుడు కొందరు టీడీపీ ఎమ్మెల్యేల మీద కోర్టుల్లో పిటీషన్ వేసి మేమే ఎమ్మెల్యేలం అని చెప్పుకోవటం గమనార్హం .
ఫ్యాను గాలి జోరుగా ఉన్నా ఓటమి పాలైన నేతలు .. ఇప్పుడు కేసులు వేసి హంగామా
అలాంటి ఓడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆధిపత్యం చెలాయించడం వైసీపీలో మిగతా నేతలకు సైతం నచ్చటం లేదు . రాష్ట్రం మొత్తం ఓ ప్రభంజనంలా వైసీపీకి పట్టం కడితే ఓటమి పాలైన ఈ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.తాజాగా ఇప్పుడు వైసీపీ ఓడిన అభ్యర్థులు తమపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ.. వారిపై కేసులున్నా అఫిడవిట్ లో దాచేశారని నానా యాగీ చేస్తూ తామే ఎమ్మెల్యేలం అని ప్రకటించుకుంటున్నారు .
లూప్ హోల్స్ వెతికి పిటీషన్లు వేస్తున్న ఓటమి పాలైన వైసీపీ నేతలు ... కొండను తవ్వి ఎలుకను పట్టుకునే యత్నం
తాజాగా టీడీపీ సీనియర్ నేత చిన్నరాజప్ప చేతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటవాణి పెద్ద పురం నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు.గెలవడం చేతకాని ఆమె టీడీపీ ఎమ్మెల్యేల లూప్ హోల్స్ వెతికి ఎమ్మెల్యేగా కోర్టుల ద్వారా గెలవాలని చూస్తున్నారు .ఇక చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం చేతిలో ఓడిపోయారు ఆమంచి కృష్ణమోహన్. వైసీపీ ఇంత గాలిలో కూడా ఈయన గెలవకపోవడం నివ్వెరపరిచింది. ఇక ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు అంటూ లూప్ హోల్స్ వెతికి కోర్టుల ద్వారా గెలవాలనుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో కీలక నేత అచ్చెన్నాయుడుపైన కూడా అనర్హత వేటు పిటీషన్ వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తిలక్ .
టీడీపీ ఎమ్మెల్యేల తప్పులు వెతికి గెలవానుకోవటం ,తప్పుడు మార్గంలో సాధించే గెలుపు మంచిది కాదంటూ విమర్శలు
2007 జూలై నెలలో ఓబులాపురం మైనింగ్ కార్యాలయంపై దాడి చేసిన కేసులో అచ్చెన్నాయుడు 21వ ముద్దాయి అని వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ ఆరోపించారు. అరెస్ట్ వారెంట్ కేసు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ అఫిడవిట్ లో పొందుపరచకుండా దాచిపెట్టడం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. అచ్చెన్నాయుడు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ఇక తాజాగా వల్లభనేని వంశీపై కూడా పిటీషన్ వేశారు .. అసలు ప్రస్తుతం పిటీషన్లు వేసిన వైసీపీ నేతలు అంత ఊపులో గెలవలేదని.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల తప్పులు తీసి గెలవాలనుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అడ్డదారుల్లో గెలుపు గెలుపుకాదని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు . ఇలా తప్పుడు మార్గంలో గెలవడం వైసీపీకి కూడా మంచిది కాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.