చిత్తూరులో ఆ మంత్రి బర్త్ డే వేడుకలు..పోటీ పడి చేసిన వైసీపీ నేతలు..కారణం ఇదే
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కాకుండా అధికార పార్టీలో సైతం ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా రాజకీయాలు చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా లో అయితే విచిత్రమైన రాజకీయాలు సాగుతున్నాయి. చిత్తూరు జిల్లా కేంద్రంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీకి చెందిన వైసీపీ నాయకులు పోటీపడి మరీ నిర్వహించడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
అట్టహాసంగా మంత్రి జన్మదిన వేడుకలు చేసిన వైసీపీ నాయకులు
గతంలో ఎన్నడూ లేనివిధంగా చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు నాయకులు.ఆయనపై అభిమానంతో ఇదంతా చేశారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వారు ఆయన జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా చేయడానికి రాజకీయ కారణాలు ఉన్నాయని పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో నగర మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న వైసిపి నాయకులు మంత్రిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారని టాక్ వినిపిస్తుంది.
పుట్టిన రోజు వేడుకలను చేసి పోటీ పడిన ముగ్గురు వైసీపీ నేతలు
ఇక మంత్రివర్యులు పుట్టినరోజు జరపడానికి పోటీపడిన నాయకులు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కో-కన్వీనర్, వైసీపీ నాయకుడు అయిన బుల్లెట్ సురేష్,చిత్తూరు నగర వైసీపీ అధ్యక్షుడు లాయర్ చంద్రశేఖర్, వైసీపీ జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు పీవీ గాయత్రిదేవిలు ఎవరికి వారే రాజకీయ లబ్ది కోసం మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. వీరిలో బుల్లెట్ సురేష్, చంద్రశేఖర్ లు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చాలా సన్నిహితంగా ఉండే నాయకులు.
కేక్ కటింగ్,అన్నదానాలతో హంగామా
ఇక ఇక వీరిలో వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ ఆయన జన్మదినం రోజున ఉదయాన్నే గాంధీ విగ్రహం వద్ద హంగామా చేశారు. తన అనుచరులతో కలిసి బర్త్ డే కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు చేశారు. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రెండు కార్యక్రమాలకు పెద్ద హంగామా జరిగిందని చెప్పొచ్చు. ఇక మరో నాయకుడైన బుల్లెట్ సురేష్ తానేమీ తక్కువ కాదు అన్నట్టు ఎంఎస్ఆర్ జంక్షన్ వద్ద మధ్యాహ్నం వేళ పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఇక మహిళా నేత,వైసీపీ జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు పీవీ గాయత్రిదేవి సైతం బాలికల పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్ధుల మధ్య పెద్దిరెడ్డి జన్మదిన వేడుక నిర్వహించారు.
రాజకీయ లబ్ది కోసమే హంగామా అని ప్రచారం
ఇలా ఎవరికివారు వేర్వేరుగా మంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఇక వీరంతా రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంత్రి సహకారం ఆశిస్తున్న వారు అని, అందుకే ఈ విధంగా పుట్టినరోజు వేడుకలను చేసి హంగామా చేస్తున్నారని చర్చ జరుగుతోంది. మహిళా నాయకురాలు గాయత్రి దేవి విషయం పక్కనపెడితే సురేష్,చంద్రశేఖర్ ఇద్దరు నువ్వా నేనా అన్న చందంగా, తమ బలాబలాలను ప్రదర్శిస్తూ, తమకు ఉన్న ప్రజా మద్దతును తెలియజేస్తూ మంత్రి పుట్టినరోజు సంబరాలు నిర్వహించారు. ఇక వీరిద్దరూ త్వరలోనే జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవికోసం తీవ్రంగా పోటీ పడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను తమ బలప్రదర్శనకు వేదికగా మార్చుకున్నారని టాక్ వినిపిస్తుంది.
చిత్తూరు కార్పోరేషన్ మేయర్ రేసులో ఉన్న వైసీపీ నేతలు
ఇక ఇద్దరు రాజకీయాల్లో హేమాహేమీలే కావటం విశేషం. ప్రస్తుతం బీసీ సంక్షేమ సంఘం కో కన్వీనర్ గా బుల్లెట్ సురేష్ కొనసాగుతున్నారు. ఇక చంద్రశేఖర్ వైసిపి నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. ఇద్దరు బిసి సామాజిక వర్గానికి చెందిన నాయకులే కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రేసులో ఉన్నారని,అందుకే మంత్రిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన జన్మదిన వేడుకలను పోటాపోటీగా జరిపారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మంత్రిని ప్రసన్నం చేసుకునే వ్యూహమే అసలు మతలబు అంటున్న స్థానికులు
త్వరలో చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలు రెండోసారి జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వుడు అయ్యింది. అయితే ఈసారి అది జనరల్ కేటగిరికి కేటాయిస్తారని భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గానికి మినహా.. మిగిలిన ఏ వర్గానికి రిజర్వేషన్ వచ్చినా సరే పోటీలో తలపడే వారు మాత్రం బుల్లెట్ సురేష్, చంద్రశేఖర్ లే అని ప్రధానంగా టాక్ వినిపిస్తుంది. మంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన వైసీపీ నాయకుల తీరు చూసి రాజకీయాల్లో పదవుల కోసం పాకులాట కామనే అని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంత్రి పుట్టినరోజు వేడుకలు జరపడంలో మతలబు ఇదే అని మాట్లాడుకుంటున్నారు.