చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు;పగలు బీజేపీతో...రాత్రి కాంగ్రెస్తో!:వైసిపి
కర్నూలు:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశ వాద రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని నందికొట్కూరు వైసిపి ఎమ్మెల్యే ఐజయ్య ధ్వజమెత్తారు. శనివారం నందికొట్కూరు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2014లో కాంగ్రెస్ పార్టీని తిట్టి బీజేపీతో దోస్తీ చేసి అధికారం చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీని తిట్టి కాంగ్రెస్తో దోస్తీకి సిద్ధం కావడం చూస్తే ప్రపంచంలోనే ఆయనంత అవకాశవాద రాజకీయ నాయకుడు ఇంకొకరు ఉండరని ఎమ్మెల్యే ఐజయ్య దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు నిమిత్తం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో చర్చలు జరిపేందుకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చిన విషయం జనాలకు తెలిసిపోయిందన్నారు.
ఎమ్మెల్యే ఐజయ్య
ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప అధికారంలోకి రాలేనని చంద్రబాబుకు తెలిసిపోయిందని...అందుకే ప్రతిసారి ఎవరో ఒకరితో అంటకాగుతూనే ఉన్నారని ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే కేసీఆర్లాగా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని అన్నారు. వైఎస్సార్ చేసిన మేలు ముస్లింలు మరవరని, వారు ఎప్పుడూ వైఎస్సార్సీపీ వెంటే ఉంటారని ఐజయ్య స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు అందరూ గమనిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఫిరాయింపుపై...వేటు వేయాలి
వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసేంత వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేది లేదని ఐజయ్య తేల్చిచెప్పారు. 22 కేసులున్న కోడెల శివప్రసాద్ను అసెంబ్లీ స్పీకర్గా ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదని తేల్చేశారు. తంగడంచ ఫారం భూముల్లో పరిశ్రమలే స్థాపించలేదని...వేల కోట్లు దోచుకునేందుకే ఇలా ప్రాజెక్ట్ల పేరుతో నాటకమాడుతున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి 50 ఎకరాల తంగడంచ ఫారం భూములు కేటాయించాలని ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్కు పంపినా ఎలాంటి స్పందన లేదని చెప్పారు.
టిడిపి...భారత్ బంద్ లో పాల్గోవాలి
టీడీపీకి చిత్తశుద్ది ఉంటే పెట్రోల్ పై పన్నులు తగ్గించి భారత్ బంద్లో పాల్గోవాలని వైసిపి నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. లీటర్ పెట్రోల్పై చంద్రబాబు సర్కార్ రూ. 4 భారం మోపుతోందని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీతో కలిసి నాలుగేళ్లుగా ప్రజలపై పన్నుల భారాన్ని మోపి, ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి పెట్రో రేట్లు తగ్గించాలని నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పగలు బీజేపీతో...రాత్రి కాంగ్రెస్తో
టీడీపీ పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తోందని వైసిపి నేత మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. పెట్రో పన్నులు తగ్గించకుండా బంద్లో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం సిలెండర్ ధర రూ. 50 పెంచితే...ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు హయాంలో గ్యాస్ సిలెండ్ ధర రూ. 400 నుంచి రూ.850కి పెరిగిందని విమర్శించారు. చిత్తశుద్ది లేని కాంగ్రెస్, టీడీపీ కలసి చేసే పెట్రో ఆందోళనకు విశ్వసనీయత లేదన్నారు. పెట్రో ధరల తగ్గింపుకోసం వైస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని వైసిపి నేతలు స్పష్టం చేశారు.