టీడీపీని వైసీపీ ఫాలో అవ్వాల్సిందేనా:జగన్కు భజనలు..పాలాభిషేకాలు: వీటి వెనుక ఉన్నదెవరు..!
ముఖ్యమంత్రి జగన్ పైన అభిమానం హద్దులు దాటుతోంది. గతంలో చంద్రబాబును ఆ పార్టీ నేతలు ఏ రకంగా అయితే కీర్తించారో..ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. తెలుగు తమ్ముళ్ల డైరీనే ఇప్పుడు వైసీపీ నేతలు ఫాలో అయిపోతున్నారు . జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో లేని ఈ అతి అభిమానం ఇప్పుడు పార్టీలో హద్దులు దాటుతోంది. ఏకంగా మంత్రులే అసెంబ్లీ సాక్షిగా జగన్ను దేవుడంటూ కీర్తిస్తున్నారు. ప్రశంసలతో..వ్యక్తి భజనతో హోరెత్తిస్తున్నారు. ఏపీ శాసససభలో ఇంతకు ముందు ఎప్పుడూ ఒక సీఎం పేరు చెప్పి..జై జైలు కొట్టటం లేదు. ఇప్పుడు అది కనిపిస్తోంది. ఇక..జగన్ పధకాలతో లబ్ది పొందిన వారితో జగన్ ఫొటోలకు పాలాభిషేకాలు..ప్ల కార్డుల ప్రదర్శనలు ..గతంలో టీడీపీ ఏ రకంగా అయితే చేసిందో..ఇప్పుడూ అదే సేమ్ టు సేమ్ ఫాలో అయిపోతున్నారు.
నాడు చంద్రబాబుకు భజనలు..
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా సంబంధింత లబ్ది దారుల తో చంద్రబాబు ఫొటోలకు పాలాభిషేకం చేయటం ఆనవాయితీగా సాగింది. అదే విధంగా చంద్రబాబు పాల్గొన్న ప్రతీ సభలో తెలుగు తమ్ముళ్లు బలవంతంగా థాంక్యూ సీఎం సర్ అని బోర్డులు చేతికి ఇచ్చి..సభలో ప్రదర్శించే వారు. ఇక .. విజయవాడ నుండి జాతీయ రహదారి మొత్తంగా థాంక్యూ సీఎం సర్ అనే పెద్ద పెద్ద హోర్డింగ్లు దర్శనమిచ్చేవి. రైతులు..మహిళలు..విద్యార్ధులు..ఉద్యోగులు ఇలా ఏ కేటగిరీకి చెందిన వారైనా సరే చంద్రబాబు నిర్ణయం తీసుకున్న మరుక్షణం ఆయనకు పాలాభిషేకం చేయాల్సిందే. ఎస్సీ కార్పోరేషన్ నుండి కార్లు అందించిన నాటి టీడీపీ ప్రభుత్వం వాటి మీద సైతం ఇదే స్లోగన్ ఏర్పాటు చేసారు. శాసనసభలో కొన్ని సందర్భాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ కూడా థాంక్యూ సీఎం సర్ అంటూ నినాదాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటి పైన అప్పట్లో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఇక, పోలవరం వద్ద అయితే చంద్రబాబు పేరుతో భజన కూడా చేసారు.
ఇప్పుడు జగన్ కోసం వైసీపీ అదే రీతిన
చంద్రబాబు కు టీడీపీ నేతలు భజన చేస్తే తప్పు బట్టిన వైసీపీ నేతలు..ఇప్పుడు జగన్ విషయంలో అదే అనుసరిస్తు న్నారు. జగన్ ముఖ్యమంత్రి అయి రెండు నెలలు అవుతోంది. అప్పుడే వైసీపీ శ్రేణులు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త పద్దతులు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు చేయగా లేనిది..తాము చేస్తే తప్పేంటి అనుకున్నట్లున్నారు. అంతే టీడీపీలో గతంలో పాదాభివందనాలు ప్రోత్సహించని చంద్రబాబు గత అయిదేళ్లలో వాటిని ఆమోదించారు. ఇప్పుడు జగన్ వద్దకు వచ్చే పలువురు పాదాభివందనాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక, జగన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు ఈ రెండు నెలల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబుకు థాంక్యూ సీఎం సర్ అని కనిపించిన బోర్డులు..ఇప్పుడు విద్యార్దులు..పధకాల లబ్దిదారుల చేతితో థాంక్యూ జగన్ అన్ని పేరుతో కనిపిస్తున్నాయి. ఇక, పార్టీ నేతలు ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సహం ప్రజల్లో చర్చకు కారణమవుతోంది.
మంత్రులు సైతం అదే బాటలో..
కేడర్ మాత్రమే కాదు..నిండు శాసనసభలో మంత్రులు సైతం జగన్ భజన ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా మంత్రి జయరాం ముఖ్యమంత్రి జగన్ను అన్ని మతాలు ఆరాధించే దేవుళ్లతో పోల్చారు. అది వివాదానికి దారి తీసి మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాసనసభలో వైసీపీ నుండి ఎన్నికైన వారిలో చాలా మంది కొత్త వారు ఉన్నారు. వారు తమ నేత మీద అభిమానం చాటుకొనేందుకు..శాసనసభలోనే ముఖ్యమంత్రికి అనుకూలంగా జై జగన్ నినాదాలు చేస్తున్నారు. అయితే, దీనిని సీనియర్ మంత్రులు సైతం పార్టీ సమావేశాల్లో వారించే విధంగా చెప్పే ప్రయత్నం చేయటం లేదు. చంద్రబాబు అతి ప్రచారం..కేడర్ అత్యుత్సాహం వారిని ప్రజలకు విరక్తి పుట్టించింది. ఇక, ఇప్పుడు వైసీపీ నేతలు సైతం ఈ ధోరణి మార్చుకోక పోతే నష్టం తప్పదనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి.