ఆశలపల్లకిలో వైసీపీ నేతలు .. ఆ మంత్రి పదవులపై అందరి దృష్టి .. జగన్ నిర్ణయమేంటో !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది కీలక నాయకులకు పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు . ఇక దీంతో కేవలం ఆ పదవులను భర్తీ చేస్తారా లేక మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అన్నది ఇప్పుడు ఏపీలో అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
టీడీపీ క్యాష్ అండ్ క్యాస్ట్ స్ట్రాటజీ ఇదే .. రాజ్యసభలో ఓటేసి.. టీడీపీపై రోజా ఫైర్
ఆ మంత్రులకు రాజ్యసభ ఇచ్చింది అందుకే
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరు విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఆర్డీఏ రద్దు బిల్లును, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలిలో గతంలోనే టిడిపి అడ్డుకుంది . ఇక ఈ బిల్లులను,సెలెక్ట్ కమిటీకి పంపించాలని శాసన మండలి నిర్ణయించడంతో, ఆ తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి ,కేంద్ర ఆమోదానికి పంపారు. ఒకవేళ కేంద్రం ఆమోదం తెలిపితే వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా కొనసాగరు.
ఎమ్మెల్సీలకు , మంత్రి పదవులకు రాజీనామా చేయనున్న నేతలు
ఇక ఈ క్రమంలో శాసనమండలి సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ,వారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశమిచ్చారు. ఇక దీంతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసే నాటికి వారు ఎమ్మెల్సీ పదవులని వదులుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే వారు మంత్రి పదవులకు కూడా రాజీనామా చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఆశావహుల దృష్టి ఆ రెండు సీట్ల మీద పడ్డాయి.
మంత్రి వర్గ విస్తరణపై పార్టీలో మల్లగుల్లాలు
సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ రెండు స్థానాలలో బీసీలకు సంబంధించిన వారికి ప్రాతినిధ్యం ఇచ్చారు కాబట్టి మళ్లీ బీసీలకు అవకాశం వస్తుంది అన్న భావన వ్యక్తమవుతోంది. అయితే పార్థసారథి, రోజా వంటి కీలక నేతలు తమకు అవకాశం వస్తుందని ఆశాభావంలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ రెండు స్థానాలు మాత్రమే భర్తీ చేస్తారా? లేక మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? అని అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. ఇక ఏ జిల్లా నుండి మంత్రులుగా నేతలు రాజీనామా చేస్తున్నారో అదే జిల్లాల నుండి, అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటే సామాజిక సమతూకం ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ అలాంటి పరిస్థితులు లేవు.
మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా ?
ఇక ఇతర జిల్లాల నేతలకు అవకాశం ఇస్తే జిల్లాల మధ్య సమన్యాయం దెబ్బతింటుంది . ఈ క్రమంలోనే పునర్వ్యవస్థీకరిస్తారేమో అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఇక ప్రస్తుత మంత్రివర్గం రెండున్నరేళ్ల పాటు ఉంటుందని, ఆ తర్వాత మంత్రుల పనితీరును బట్టి మార్పులు చేర్పులు ఉంటాయని, రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిపి కొత్త మంత్రివర్గాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తానని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది దాటింది. మరి ఇంతలోపే మంత్రివర్గ విస్తరణ చేస్తారా అన్నది అనుమానమే.
జగన్ నిర్ణయం ఏమిటో ?
ఇక ఇదే సమయంలో పునర్వ్యవస్థీకరణ చేస్తే పార్టీ నేతల్లో కొత్త పంచాయతీ పెట్టినట్టు అవుతుందని భావిస్తున్న పరిస్థితి లేకపోలేదు. ఏదేమైనా ఖాళీ అవుతున్న రెండు మంత్రి పదవులు భర్తీ చేస్తారా, లేక ఆ శాఖలను వేరేవారికి అప్పగిస్తారా ? మంత్రివర్గ విస్తరణ జరుపుతారా? లేక మొత్తం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారా? జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో చర్చ తో పాటు, ఆశావహుల్లో పోటీకి కారణమౌతుంది.