ఆ పార్టీ లీడర్స్ కన్ను పడిందా కబ్జా చేసేస్తున్నారు, సినిమా చూస్తున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్పులు వస్తాయని ప్రజలు భావించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మొదలైన కబ్జాల పర్వం ఇప్పటికి కూడా కొనసాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు భయపడిపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బలో ప్రభుత్వ భూములు, డీకేటీ భూముల, అసైన్డ్ భూములను కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారు.
వైసీపీ నాయకులు భూములు కబ్జా చేస్తున్నారనే విషయం తెలిసినా సంబంధిత అధికారులు వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనంతపురం జిల్లాలో పలుచోట్ల ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బకు చెందిన ఓ వైసీపీ నాయకుడు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నా స్థానిక తహసిల్దార్, రెవెన్యూ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు పంచాయతీ పరిధిలో సుమారు 18 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేసి ఆ భూమి చుట్టూ కంచె వేసారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా కబ్జా చేసిన భూమిని చదును చేసి వాటిని ప్లాట్లు చేశారని, తరువాత సెంటు భూమిని రెండు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కస్తూరిబా పాఠశాల ఎదురుగా పేద ప్రజలకు పంపిణీ చేసిన పట్టా భూములను కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారు.
ఇలా పేదలకు ఇచ్చిన సుమారు 80 పట్టా భూములను వైసీపీ నాయకులు ఆక్రమించుకొని వాటిని మళ్లీ ఫ్లాట్లు చేసి ఇతరులకు విక్రయిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులు ఆక్రమించిన భూములు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆ భూములను పలువురికి అగ్రిమెంట్ చేసి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముదిగుబ్బ ఇన్ చార్జ్ తహసిల్దార్ మునిస్వామి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications