సీఎం నోట గ్యాంబ్లర్ల మాట...! టీడీపీ గెలుస్తుందని అక్కడ టాక్ :బాబు... వారినే నమ్ముతారా :వైసీపీ
Recommended Video
ఏపీలో ఎన్నికల్లో గెలుపు పైన ఎవరి అంచనాల్లో వారున్నారు. అనేక సర్వే సంస్థల పేర్లతో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు బిజీగా ఉన్నారు. ప్రముఖ సర్వే సంస్థలు..వ్యక్తులు చెప్పే సర్వే లెక్కలు..అంచనాలు ఎవరికి వారు మాకే అనకూలమని చెబుతున్నారు. అయితే, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ముంబాయిలోని గ్యాంబ్లర్లు కూడా టిడీపీ గెలుస్తుందని చెబుతున్నారంటూ చేసిన వ్యాఖ్యల వీడియోను వైసీపీ విడుదల చేసింది. ఇక, దీని పైన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ చర్చ మొదలైంది.
గ్యాంబ్లర్ల ప్రస్తావన ఎందుకు..
టిడీపీ అధినేత చంద్రబాబు పార్టీ విజయం గురించి ధీమా వ్యక్తం చేస్తూ అందుకు మద్దతుగా ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. "బాంబేలో సట్టా అనే ఓ మార్కెట్ గ్యాంబ్లింగ్ చేస్తుంటారు. మట్కా మాదిరిగా. నిన్న వేరే వాళ్ళు వచ్చి చెబుతున్నారు. అందులో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని. మొత్తం వాళ్ళు ఎంత కావాలంటే అంత కట్టే పరిస్థితికి వచ్చారని"..చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల పైన సర్వే సంస్థలు..లేదా ప్రముఖ నిపుణులు చెప్పే మాటలను ఆధారంగా చేసుకొని విజయం పైన మాట్లాడితే ఇబ్బంది లేదు. కానీ, ఏకంగా ముంబయి లోని గ్యాంబ్లర్ల గురించి ప్రస్తావిస్తూ..వారు కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పటం పైనే ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని సరిగ్గా వైసిపి క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తోంది.
ఓటర్లను నమ్మరా..వారినే నమ్ముతారా..
చంద్రబాబు వ్యాఖ్యల ఆడియో విడుదల చేసిన వైసినీ నేత శ్రీకాంత్ రెడ్డి దీని పైన టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు ప్రజల ఓట్ల పైన నమ్మకం ఉండదు..ఈవీఎంల పైనా నమ్మకం ఉండదు.. కానీ, ఇటువంటి వ్యాఖ్యల ద్వారా గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహించేలా ఉందన్నారు. సీఎం హోదాలో ఉండి సట్టా మార్కెట్, మట్కాలపై ఎలా మాట్లాడతారంటూ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని పక్కన పెట్టి బెట్టింగ్ రాయుళ్ళు పందేలా ఆధారంగా టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు చెప్పుకునే స్థితికి వచ్చారని ఎద్దేవా చేసారు. పోలింగ్ పూర్తయిన వెంటనే మహిళలు..వృద్దులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమకే ఓట్లు వేసారని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు వీరిని ప్రస్తావించటం పైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
క్యాడర్ కాపాడుకొనేందుకేనా..
ఎన్నికల ఫలితాల పైన పార్టీల్లో లోపలా బయటా చర్చలు సాగుతున్నాయి. టీడీపీ గెలుపు గురించి ఆ పార్టీ నేతలు .. ఒకటి-రెండు సర్వే సంస్థలు మినహా మరెవ్వరూ గట్టిగా చెప్పటం లేదు. వైసీపీ గెలుపు ఖాయమంటూ అనేక సర్వే సంస్థల పేర్లతో సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, టీడీపీ అధినేత మంత్రం అండర్ కరెంట్ ఉందని..ఆ సైలెంట్ ఓటింగ్ ఎవరికీ అర్దం కాదనే విశ్లేషణ చేస్తున్నారు. అయితే, టిడీపీ పైన వైసీపీ సైతం విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసే స్థానిక ఎన్నికల వరకూ అయిన క్యాడర్ ను కాపాడుకునేందుకే ఈ తంటాలు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.