కాలేజీ రోజులను ఇంకా మర్చిపోని వైసీపి నేతలు..! ర్యాగింగ్ కు పాల్పడుతున్నట్టు సీఎం కి ఫిర్యాదులు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సునామీలాంటి విజయాన్ని చేజిక్కించుకున్న వైసీపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువమంది సీనియర్లే. జూనియర్లు తక్కువ. మంత్రివర్గంలోనూ సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లు... ఇప్పుడు ఈ జూనియర్లను 'ర్యాగింగ్' చేస్తున్నారట. చదవడానికి, వినడానికి వింతగా అనిపించే విస్తుగొలిపే నిజమిది.
సీనియర్ ఎమ్మెల్యేల ముందు కొత్త జూనియర్ మంత్రులు కుర్రాళ్లు. అందుకే ఇప్పుడు వైసీపీలో కొత్త (జూనియర్) మంత్రులను సీనియర్ ఎమ్మెల్యేలు లెక్కలోకే తీసుకోవడం లేదట. ఏమాత్రం ఖాతరు చేయడం లేదట. కొన్నిచోట్ల... జూనియర్ మంత్రులను సీనియర్ ఎమ్మెల్యేలు... పూచిక పుల్లలాగా తీసిపడేస్తున్నారట. 'నువ్వు రాష్ట్రానికి మంత్రివైతే కావొచ్చు. ఇక్కడ (నియోజకవర్గంలో) మాత్రం... అంతా నేనే. నా తర్వాతే నువ్వు' అని, కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రుల మొహమ్మీదనే చెప్పేస్తున్నట్టు తెలుస్తోంది.
నువ్వు ఎక్కడ ఏమైనా చేసుకో.. నా నియోజకవర్గంలో మాత్రం నాకు తెలియకుండా, నా అంగీకారం లేకుండా ఏమీ జరగడానికి వీల్లేదని బల్ల గుద్ది చెబుతున్నారట. సీనియర్ ఎమ్మెల్యేల దెబ్బకి చాలామంది ఎందుకొచ్చిన గొడవ అని కొత్త మంత్రులు గమ్మున ఊరుకుంటున్నారట. సీనియర్ ఎమ్మెల్యేల ధోరణితో జూనియర్ మంత్రులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట. వారికి అర్థమయ్యేటట్టు చెబుదామంటే సీనియర్లు కావడంతో ఏమీ అనలేని పరిస్థితిలో మంత్రులున్నారు.
పైగా రెండున్నర ఏళ్ల తర్వాత జగన్ కేబినెట్ విస్తరిస్తారు. అప్పుడు సీనియర్లు మంత్రులై తమ పోస్టు ఊడిపోతే ప్రమాదమని గమ్మున ఊరుకుంటున్నారట. ఇప్పుడు వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యేల ర్యాగింగ్ జూనియర్ మంత్రులు తట్టుకోలేకపోతున్నట్టు పార్టీ వర్గాల్లో ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఈ విషయం, జగన్ వద్దకు వెళ్లిందట. మరి, ఆయన ఏం పరిష్కారం చెబుతారో, అసలు ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ కుర్ర మంత్రుల్లో, కుర్ర ఎమ్మెల్యేల్లో నెలకొన్నట్టు చర్చ జరగుతోంది.